Tokyo Olympics Day 9: క్వార్టర్ ఫైనల్లోకి భారత మహిళల హాకీ జట్టు

31 Jul, 2021 21:18 IST|Sakshi

Tokyo Olympics 2020: మహిళల 100 మీటర్ల విభాగంలో స్ప్రింటర్‌ ఎలైన్ థామ్సన్‌కు స్వర్ణం దక్కింది. 10.61 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసిన ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది.


క్వార్టర్ ఫైనల్లోకి భారత మహిళల హాకీ జట్టు
టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్ జట్టు ఐర్లాండ్ ను 2-0 గోల్స్ తేడాతో ఓడించడంతో భారత్ క్వార్టర్ ఫైనల్లో ఆడే అవకాశం దక్కింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స కు చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై 4-3తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

పోరాడి ఓడిన సింధు
సెమీ ఫైనల్‌లో తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. చైనీస్‌ తైపీకి చెందిన తైజుయింగ్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో 18-21, రెండో గేమ్‌లో 12-21 తేడాతో తైజు చేతిలో ఓడిపోయింది.

రెండో గేమ్‌లోనూ వెనుకంజ
సెమీస్‌లో తొలి గేమ్‌ ఓడిన పీవీ సింధు రెండో గేమ్‌లోనూ వెనుకబడి ఉంది. తైజు 20-12తో ముందంజలో నిలిచింది. సింధుపై ఒత్తిడి పెంచుతూ తైజు అటాకింగ్‌ కొనసాగిస్తోంది.

తొలి గేమ్‌ ఓడిపోయిన పీవీ సింధు
సెమీ ఫైనల్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తైజుయింగ్‌ సత్తా చాటుతోంది. తొలి గేమ్‌లో 21-18తో పీవీ సింధును ఓడించింది. 

హోరాహోరీగా పీవీ సింధు- తైజు సమరం
బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పీవీ సింధు- తైజుయింగ్‌ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది. తొలి గేమ్‌లో ఆధిక్యం దిశగా సింధు దూసుకుపోయినప్పటికీ.. తైజు సైతం గట్టి పోటీనిస్తోంది.

క్వార్టర్ ఫైనల్‌లో బాక్సర్ పూజారాణి ఓటమి
టోక్యో ఒలింపిక్స్ లో బాక్సర్ పూజారాణి పోరాటం ముగిసింది. మహిళల (69-75 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో  చైనాకు చెందిన క్వియాన్ లీ చేతిలో పూజారాణి ఓటమి పాలయ్యింది. 


సెమీస్ మ్యాచ్ 1 లో గెలిచి ఫైనల్ చేరిన  చైనా షట్లర్ చెన్ యు ఫెయ్..
టోక్యో ఒలింపిక్స్  మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ -2లో  చైనా షట్లర్ చెన్ యు ఫెయ్, బింగ్జియావో పై విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. హోరాహోరీగా ఈ మ్యాచ్‌ లో ఫస్ట్  గేమ్‌లో చెన్ యూ ఫెయ్ 21-16తో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బింగ్జియావో13-21 తో విజయం సాధించింది.దీంతో మూడో మ్యాచ్‌లో చైనా షట్లర్ చెన్ యు ఫెయ్ విజయం సాధించింది

మొదటి రౌండ్‌లో ఓడిన భారత బాక్సర్ పూజా రాణి
టోక్యో ఒలింపిక్స్ లో  మహిళల మిడిల్ వెయిట్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీతో భారత పూజా రాణి మొదటి రౌండ్ 0-5తో ఓడిపోయింది.

టోక్యో: బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్(2) కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. తొలి సెమీస్‌ ముగిసిన తర్వాతే పీవీ సింధు- తైజుయింగ్‌ పోరుకు రంగం సిద్ధం కానుంది.

కాసేపట్లో తైజుయింగ్‌తో తలపడనున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్‌ తైజుయింగ్‌తో సింధు మరికాసెపట్లో తలపడునుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి విశ్వ యవనికపై భారత పతకాన్ని రెపరెపలాడించిన సింధు టోక్యోలోనూ సత్తా చాటుతోంది. తాజా ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సింధు పతకానికి రెండడుగుల దూరంలో ఉంది. సింధు, తైజుయింగ్‌ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
(చదవండి: Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు..)

50 మీ రైఫిల్‌ విభాగంలో భారత షూటర్లకు నిరాశ
►టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త షూట‌ర్లు మరోసారి నిరాశ‌ప‌రిచారు. మ‌హిళ‌ల 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్స్ ఈవెంట్‌లో అంజుమ్ ముద్గిల్‌, తేజ‌స్విని సావంత్‌లు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయారు. 2018 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన అంజుమ్‌. ఇవాళ జ‌రిగిన ఈవెంట్‌లో క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో 15వ స్థానంలో నిలిచింది. ఆమె 1167 స్కోర్ చేసింది. మ‌రో షూట‌ర్ తేజ‌స్విని 1154 స్కోర్‌తో 33వ స్థానంలో నిలిచింది. అయితే కేవ‌లం టాప్ 8 మంది షూట‌ర్లు మాత్ర‌మే ఈ ఈవెంట్‌లో ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తారు. యుసియా జికోవా ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసింది. 1182 స్కోర్ చేసి ఆమె ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది.

భారత​ మహిళల హాకీ జట్టుకు మరో విజయం
►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. చివరివరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో గెలిచి క్వార్టర్స్‌ రేసులో నిలిచింది. 

భారత్‌ తరపున ఆట 4,17, 49వ నిమిషంలో వందన కటారియా, 32 నిమిషంలో నేహా గోల్స్‌ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున మారియా, హంటర్‌, టీసీ గ్లాస్బీలు గోల్స్‌ చేశారు. ప్రస్తుతం క్వార్టర్స్‌ రేసులో ఉన్న భారత్‌ .. బ్రిటన్‌, ఐర్లాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓడిపోయినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు క్వార్టర్స్‌ అవకాశం ఉంటుంది.

డిస్కస్‌ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్‌ కౌర్‌
►టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్‌ త్రో విభాగంలో కమల్‌ప్రీత్‌ కౌర్‌ సంచలనం సృష్టించింది. డిస్కస్‌ త్రో విభాగంలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. కాగా కమల్‌ప్రీత్‌ మూడో ప్రయత్నంలో సరిగ్గా 64 మీ విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మొత్తం మూడు రౌండ్లపాటు జరిగిన డిస్కస్‌త్రోలో కమల్‌ప్రీత్‌ తొలి రౌండ్‌లో 60.29, రెండో రౌండ్‌లో 63.97, మూడో రౌండ్‌లో 64 మీ విసరడం విశేషం. ఇక ఈ ఈవెంట్‌లోనే గ్రూప్-ఏలో పార్టిసిపేట్ చేసిన మ‌రో ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పూనియా 60.57 మీట‌ర్ల దూరమే విసిరి ఫైన‌ల్‌కు క్వాలిఫై కాలేక‌పోయింది. మొత్తంగా సీమా పూనియా16వ స్థానంలో నిలిచింది.

ప్రీక్వార్టర్స్‌లో అమిత్‌ పంగల్‌ ఓటమి
►ఇండియాకు బాక్సింగ్‌లో క‌చ్చితంగా మెడ‌ల్ తీసుకొస్తాడ‌నుకున్న బాక్స‌ర్ అమిత్ పంగాల్‌కు షాక్ తగిలింది. అత‌డు ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. కొలంబియా బాక్స‌ర్ మార్టినెజ్ రివాస్‌తో జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్ బౌట్‌లో1-4 తేడాతో అమిత్ ప‌రాజ‌యం పాల‌య్యాడు. 48-52 కేజీల ఫ్లైవెయిట్ కేట‌గిరీలో టాప్ సీడ్‌గా బ‌రిలోకి దిగిన అమిత్‌.. ఈసారి మెడ‌ల్ హాట్ ఫేవ‌రెట్‌ల‌లో ఒక‌డిగా ఉన్నాడు. కానీ అత‌డు క‌నీసం క్వార్ట‌ర్స్‌కు చేరుకోక‌పోవ‌డం తీవ్ర నిరాశ క‌లిగించేదే. బౌట్ మొత్తం అటాకింగ్ కంటే డిఫెన్స్‌కే ప్రాధాన్య‌మిచ్చిన అమిత్‌.. త‌గిన మూల్యం చెల్లించాడు.

రౌండ్‌ ఆఫ్‌ 8లో అతాను దాస్‌ ఓటమి
►టోక్యో ఒలింపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్‌ పోరు ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో భాగంగా జపాన్‌కు చెందిన ఫురుకవా తకహారుతో జరిగిన మ్యాచ్‌లో అతాను 6-4 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి మూడు సెట్ల పాటు వీరిద్దరు హోరాహోరీగా తలప్డడారు. అయితే నాలుగ, ఐదో సెట్లో అతాను వరుసగా 27, 28 పాయింట్లు సాధించాడు. అయితే జపాన్‌ ఆటగాడు తకహారు 28, 29 పాయింట్లు సాధించడంతో అతాను దాస్‌ ఓటమి ఖాయమైంది. 

డిస్కస్‌ త్రోలో సీమా పూనియా ఐదో స్థానం
►టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్‌ త్రో విభాగంలో సీమా పూనియా బరిలోకి దిగి నిరాశపరిచింది. లాంగ్‌ డిస్కస్‌ త్రో విభాగంలో ఆమె 60.57 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచింది.

టోక్యో ఒలింపిక్స్‌లో నేటి మ్యాచ్‌లు
ఉదయం 7 గంటలకు స్విమ్మింగ్‌ పురుషుల 100 మీ. బటర్‌ఫ్లై ఫైనల్
ఉదయం 7:07 గంటలకు స్విమ్మింగ్ మహిళల 200 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్
ఉదయం 7:16కు స్విమ్మింగ్ మహిళల 800 మీ. ప్రీ స్టైల్ ఫైనల్
ఉదయం 7:18కి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ప్రి క్వార్టర్స్ (అతానుదాస్)

మరిన్ని వార్తలు