బాక్సింగ్‌ రింగ్‌ వద్దే కూర్చొని నిరసన

1 Aug, 2021 21:23 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగిన ఓ బాక్సింగ్‌ పోరు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ్రెంచ్‌ బాక్స్‌ మౌరాద్‌ అలీవ్‌ సుమారు గంట పాటు బాక్సింగ్‌ రింగ్‌ వద్దే కూర్చొని నిరసన తెలిపాడు. తనపై అనర్హత వేటు వేయడంతో అసహన వ్యక్తం చేశాడు మౌరాద్‌. హెవీవెయిట్‌ బాక్సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా బ్రిటన్‌కు చెందిన ఫ్రెజర్‌ క్లార్క్‌తో జరిగిన బౌట్‌ సందర్భంగా మౌరాద్‌ అలీవ్‌ అనర్హతకు గురయ్యాడు. అదే సమయంలో ఫ్రెజర్‌ను విజేతగా ప్రకటించారు. ప్రత్యర్థి ఫ్రెజర్‌ను పదే పదే తలతో కొట్టి గాయ పర్చడంతో మౌరాద్‌ అలీవ్‌పై వేటు పడింది. బాక్సింగ్‌ తొలి రౌండ్‌లో అలీవ్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.  

ఐదుగురు జడ్జిలు అతనికే ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. కానీ రెండో రౌండ్‌లో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరువురు బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు. ఆ క్రమంలోనే అలీవ్‌ తలతో దాడికి దిగాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా కావడంతో అలీవ్‌పై అనర్హత వేటు వేస్తు నిర్ణయం తీసుకోగా ఫ్రెజర్‌ సెమీస్‌కు చేరినట్లు ప్రకటించారు. దీన్ని జీర్ణించుకోలేని అలీవ్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్దే కూర్చొండి పోయాడు. కాగా, అక్కడి అధికారులు అతనితో మాట్లాడిన తర్వాత వెళ్లిపోయిన అలీవ్‌.. మళ్లీ 15 నిమిషాల తర్వాత వచ్చి మళ్లీ అక్కడే కూర్చొండిపోయాడు. ఇలా గంటకు పైగా కూర్చొని నిరసన తెలిపాడు. తనకు ఎటువంటి వార్నింగ్‌ ఇవ్వకుండా పోరును అర్థాంతరంగా ఆపేసి తాను మ్యాచ్‌ను కోల్పోతున్నట్లు ప్రకటించారని అలీవ్‌ ఆరోపిస్తున్నాడు. తాను గెలిచే మ్యాచ్‌ను జడ్జిలే లాగేసుకున్నారని విమర్శలు గుప్పించాడు. ఈ మెగా టోర్నీ కోసమే తన లైఫ్‌ను పణంగా పెట్టానని, అటువంటి ఇలా ఎందుకు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు