Tokyo Olympics: ఓడిపోయారు.. కాంస్యం గెలిచినా చరిత్రే

4 Aug, 2021 19:16 IST|Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల జట్టు సెమీస్‌లో ఓడిపోయినప్పటికి అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన భారత మహిళల జట్టు ఫైనల్‌ చేరుతుందని అంతా భావించారు.


అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో ఆట ఆరంభంలోనే గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా త‌ర‌ఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం రాలేదు. అయితే భారత్‌ జట్టు సెమీస్‌లో ఓడినప్పటికి రాణి రాంపాల్‌ సేనకు మరో సువర్ణావకాశం ఉంది. కాంస్య పతక పోరులో భాగంగా ఆగస్టు 6న బ్రిటన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే గనుక అది కూడా ఒక చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో భారత  మహిళల జట్టు ఇంతవరకు పతకం సాధించలేదు. ఒకవేళ  కాంస్యం గెలిస్తే మాత్రం సరికొత్త చరిత్ర కానుంది.

మరిన్ని వార్తలు