125 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో ఇలా తొలిసారి..

25 Jul, 2021 19:26 IST|Sakshi

టోక్యో: 125 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు పసిడి పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించగా, అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 

ఇలా తోబుట్టువులు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఒలింపిక్స్‌ చరిత్ర ఇదే తొలిసారి. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన అమండైన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా,  ఆమె సోదరుడు 23 ఏళ్ల హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు. కాగా, ఈ ఇద్దరు అన్నా చెలెల్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో జపాన్‌ పసిడి పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఓవరాల్‌గా ఆతిధ్య దేశం ఖాతాలో ఆరు పతకాలు(5 స్వర్ణాలు సహా ఓ రజతం) చేరాయి. 

మరిన్ని వార్తలు