TN Kabaddi Player Death: 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాను గుర్తుచేస్తూ మృత్యు ఒడిలోకి.. వీడియో వైరల్‌

27 Jul, 2022 13:52 IST|Sakshi

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ఏరియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదం నింపాయి. పోటీల్లో పాల్గొన్న విమల్‌రాజ్ అనే యువకుడు లైవ్‌ మ్యాచ్‌లోనే ప్రాణాలు వదిలాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌ మధ్యలో విమల్‌రాజ్ కూతకి వెళ్లాడు. ప్రత్యర్థి ప్లేయర్లపై నుంచి ఎగిరి గీత దగ్గరికి వచ్చిన విమల్‌రాజ్‌ను ప్రత్యర్థి ప్లేయర్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ ప్లేయర్ మోకాలు, విమల్‌రాజ్ ఛాతిపై బలంగా తగిలింది.

విమల్‌రాజ్ గీత దాటడం, అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో సదరు ప్లేయర్ కూడా లైన్ బయట చేతులు పెట్టడంతో విమల్‌రాజ్‌కే పాయింట్ ఇస్తూ రిఫరీ విజిల్ విసిరాయి. ప్రత్యర్థి ప్లేయర్ తనపై నుంచి లేవగానే పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్‌రాజ్, లేస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, రిఫరీ వచ్చి లేపేందుకు ప్రయత్నించినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన తోటి ప్లేయర్లు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరే సమయానికే విమల్‌రాజ్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.

కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయి ఉండాడని ప్రాథమిక అంచనాకి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నేచురల్‌ స్టార్‌ నాని నటించిన 'భీమిలీ కబడ్డీ జట్టు' సినిమా తరహాలోనే ఇక్కడ విమల్‌రాజ్‌ ప్రాణాలు వదలడం అందరిని కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: భారత్‌కు భారీ షాక్‌.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్‌ చోప్రా ఔట్‌!

మరిన్ని వార్తలు