రోహిత్‌ను బంతితో కొట్టిన షా, ట్రోలింగ్‌ షురూ!

15 Jan, 2021 19:34 IST|Sakshi

బ్రిస్బేన్‌: పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లు ఏదైనా పొరపాటు చేసినట్టు తెలిస్తే చాలు ట్రోలింగ్‌ మొదలవుతుంది. ఐపీఎల్-‌ 2020, ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతగా రాణించని పృథ్వీ షా కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. బ్రిస్బేన్‌ టెస్టులో అతను తుది జట్టులో లేకపోయినప్పటికీ ట్రోలింగ్‌ బారినపడ్డాడు. తాజా టెస్టులో గజ్జల్లో గాయం కారణంగా నవదీప్‌ సైనీ అర్ధాంతరంగా మైదానాన్ని వీడక తప్పలేదు. దాంతో అతని స్థానంలో షా ఫీల్డింగ్‌కు వచ్చాడు. షా ఇన్నర్‌ లైన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో.. బ్యాట్స్‌మన్‌ బాదిన ఓ బంతి అతని వైపునకు వచ్చింది. దాన్ని అడ్డుకుని నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపునకు షా బంతిని బలంగా త్రో విసిరాడు. అయితే, అది కాస్తా మిడాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మను తాకింది. ఊహించని బంతితో రోహిత్‌ ఒకింత కలవరానికి గురయ్యాడు. అయినప్పటికీ ఏమీ మాట్లాడకుండా బంతిని బౌలర్‌కు అందించాడు.
(చదవండి: మారని తీరు: సిరాజ్‌పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు)

ఈ వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో.. ‘ఫ్రెండ్లీ ఫైర్‌’ అంటూ షేర్‌ చేసింది. దాంతో షాపై ట్రోలింగ్‌ షురూ అయింది. నువ్‌ కావాలనే చేశావ్‌. రోహిత్‌ గాయపడితే జట్టులోకి వద్దామని ఇదంతా ప్లాన్‌ అని కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌ ఊరుకున్నా. మేము ఊరుకోం. నువ్‌ టీమ్‌లోకి అవసరం లేదు అని ఫన్నీ మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక టెస్టు సిరీస్‌ విషయానికొస్తే ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్‌ వేదికగా గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లలో లబూషేన్‌ (108) రాణించాడు.  స్టీవ్‌ స్మిత్‌ (36), మాథ్యూవేడ్(45)‌ ఫరవాలేదనిపించారు. కామెరూన్‌ గ్రీన్‌ (28), కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (38) క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్‌ నటరాజన్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌సుందర్‌, సిరాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.
(చదవండి: ధోని నుంచి కోహ్లి వరకు.. సేమ్‌ టు సేమ్‌)

మరిన్ని వార్తలు