‘వారిద్దరూ టీమిండియాకు ఆడటం ఖాయం’

10 Nov, 2020 17:17 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు యువ క్రికెటర్లు సత్తాచాటిన సంగతి తెలిసిందే, వారిలో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లైన సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌లు కూడా ఉన్నారు.  టోర్నమెంట్ అంతటా సూర్య కుమార్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించగా చాహర్ తన స్పిన్ బౌలింగ్‌తో గేమ్ ఛేంజర్ పాత్రను పోషిస్తూ వస్తున్నాడు. వీరిపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లండ్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర​ డొమినిక్‌ కార్క్‌. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌ జట్టు రిజర్వ్‌ బెంచ్‌ చాలా బలంగా ఉందని కొనియాడాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ టాక్‌ షోలో మాట్లాడిన కార్క్‌..ముంబై జట్టు అత్యంత పటిష్టంగా ఉందన్నాడు.

ఒకరు గాయపడితే ఆ ప్లేస్‌ను  భర్తీ చేయడానికి తగినన్ని వనరులు ముంబై జట్టులో ఉన్నాయన్నాడు. లెఫ్టార్మ్‌ బౌలర్‌ అయిన బౌల్ట్‌ గాయపడితే, అతని స్థానాన్ని రిప్లేస్‌ చేయడానికి లెఫ్టార్మ్‌ బౌలర్‌ అయిన మెక్లీన్‌గన్‌ ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఇలా ఎక్కడ చూసుకున్నా ముంబై అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందన్నాడు. అటు సీనియర్లు, ఇటు యువ టాలెంటెడ్‌ క్రికెటర్ల సమ్మేళనమే ముంబై ఇండియన్స్‌ అని అభిప్రాయపడ్డాడు. అసాధారణ నైపుణ్యమున్న యంగ్‌ క్రికెటర్లతో ముంబై కల్గి ఉండటమే వారి విజయాలకు కారణమన్నాడు. అందులో సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌ల పేర్లను కార్క్‌ ప్రస్తావించాడు. వారిద్దరూ కచ్చితంగా టీమిండియాకు ఆడతారని పేర్కొన్నాడు. ఈరోజు (మంగళవారం) ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరనుగంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఒకవైపు, తొలి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ మరొకవైపు టైటిల్‌ వేట కోసం సన్నద్ధమయ్యాయి. 

మరిన్ని వార్తలు