గ్రౌండ్‌లో కుప్పకూలిన క్రికెటర్లు.. షాక్‌లో ఆటగాళ్లు

3 Jul, 2021 18:23 IST|Sakshi

అంటిగ్వా: పాకిస్తాన్‌ వుమెన్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇద్దరు విండీస్‌ మహిళా క్రికెటర్లు చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్‌లు గ్రౌండ్‌లోనే కుప్పకూలడం ఆందోళన కలిగించింది. పాకిస్తాన్‌  ఇన్నింగ్స్‌ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆటగాళ్లు అప్రమత్తమై సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఫిజియో వచ్చి వారిని పరీక్షించి స్ట్రెచర్‌పై మైదానం నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ''ప్రస్తుతం వారిద్దరు కోలుకుంటున్నారని.. వాతావరణ మార్పులు, విపరీతమైన వేడిని తట్టుకోలేక డీహైడ్రేట్‌ అయ్యారని వైద్యులు తెలిపారు. ఇప్పడు వారిద్దరు బాగానే ఉన్నారని'' వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.  

కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ వుమెన్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 7 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ వుమెన్స్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కైసియా నైట్ 30 నాటౌట్‌,  చెడియన్‌ నేషన్‌ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ వుమెన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. దీంతో వర్షం అంతరాయం కలిగించే సమయానికి పాక్‌ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 103 పరుగులతో ఆడుతోంది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం విండీస్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు