పాక్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌కు ఊరట

26 Feb, 2021 16:16 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాడు ఉమర్‌ అక్మల్‌కు ఊరట లభించింది. పీసీబీ అత‌నిపై విధించిన బ్యాన్‌ను కోర్ట్‌ ఆప్‌ ఆర్బిర్టేషన్‌ ఫర్ స్పోర్ట్స్‌(సీఏఎస్)‌ 12 నెల‌ల‌కు త‌గ్గించడంతో పాటు రూ. 42 ల‌క్ష‌ల జరిమానా విధించింది. అయితే పీసీబీ యాంటీ కరప్షన్‌ కోడ్‌ నిర్వహించే రీహాబిటేషన్‌ సెషన్‌లో పాల్గొన్న తర్వాతే ఉమర్‌ అక్మల్‌ను క్రికెట్‌ ఆడేందుకు అనుమతి ఇస్తామని పీసీబీ తెలిపింది. తాజాగా విధించిన 12 నెలల నిషేధం ఉమర్‌ అక్మల్‌ ఇప్పటికే పూర్తి చేసి ఉండడంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు. కాగా ఉమర్‌ అక్మల్‌ 2019 అక్టోబర్‌లో పాక్‌ తరపున చివరి వన్డే ఆడాడు. ఇప్పటివరకు పాక్‌ తరపున అక్మల్‌ 121 వన్డేల్లో 3194 పరుగులు, 84 టీ20ల్లో 1690 పరుగులు సాధించాడు. అక్మల్‌ ప్రస్తుతం 30ఏళ్ల వయసులో ఉన్న అక్మల్‌ తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తే మరో 5నుంచి 6ఏళ్ల పాటు ఆడే అవకాశం ఉంది. 

2019లో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సందర్భంగా  బుకీల గురించి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్‌పై ఏప్రిల్‌లో మూడేళ్ల సస్పెన్షన్‌ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్‌ తనను క్షమించాలంటూ జూలై 2020లో సీఏఎస్‌కు అప్పీల్‌ చేయగా.. అప్పట్లో కోర్టు 18 నెలలకు కుదించింది. తాజాగా అక్మల్‌ అభ్యర్థనను మరోసారి పరిగణలోకి తీసుకొన్న సీఏఎస్‌ నిషేధాన్ని 12 నెలలకు తగ్గించడంతో పాటు జరిమానా విధించింది.
చదవండి: పాస్‌పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్‌ దూరం?
స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్‌

మరిన్ని వార్తలు