Umpire’s Call: ఐసీసీ కీలక నిర్ణయం

2 Apr, 2021 06:03 IST|Sakshi

ఐసీసీ మీటింగ్‌లో నిర్ణయం

దుబాయ్‌: అంపైర్‌ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్‌)లో తరచూ చర్చనీయాంశమవుతున్న ‘అంపైర్స్‌ కాల్‌’ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)  సమావేశంలో  తేల్చారు. అలాగే కోవిడ్‌ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ల కోసం 23 మంది సభ్యులతో జట్లను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. ‘క్రికెట్‌ కమిటీ ప్రధానంగా అంపైర్స్‌ కాల్‌పై చర్చించి విశ్లేషించింది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్‌ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్‌ఎస్‌లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్‌ అంపైర్‌దే తుది నిర్ణయం. అంపైర్‌ కాల్‌ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది’ అని కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే తెలిపారు. ఎల్బీడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్‌ కాల్‌ తరచూ వివాదాస్పదమవుతోంది.   బర్మింగ్‌హామ్‌లో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా కల్పించిన ఐసీసీ... మహిళల వన్డే మ్యాచ్‌లు ‘టై’గా ముగిస్తే సూపర్‌ ఓవర్‌ నిర్వహించాలని కూడా నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు