IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత జట్టులోకి ఉమ్రాన్‌, మోహ్షిన్‌, కార్తీక్‌..!

21 May, 2022 17:11 IST|Sakshi
Courtesy: IPL Twitter

టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌ ఢిల్లీ వేదికగా జూన్‌ 9న జరగనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును మే 25న బీసీసీఐ ఎంపిక చేయనుంది. అయితే ఈ సిరీస్‌కు ఐపీఎల్‌-2022లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లతో పాటు వెటరన్‌ ఆటగాళ్లను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది.

కాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌, లక్నో పేసర్‌ మోహ్షిన్‌ ఖాన్‌, వెటరన్‌ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ను సెలక్టెర్లు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో మాలిక్‌, మోహ్షిన్‌ ఖాన్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన మాలిక్‌ 21 వికెట్లు పడగొట్టగా.. 8 మ్యాచ్‌లు ఆడిన మోహ్షిన్ 13 వికెట్లు సాధించాడు.

అదే విధంగా గత కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా కూడా తిరిగి జట్టులో రానున్నారు. కాగా ఈ సిరీస్‌లో భారత జట్టుకు ధావన్‌ లేదా హార్ధిక్‌ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఎందుకంటే రోహిత్‌ సారథ్యంలో సీనియర్‌ భారత జట్టు.. జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం జూన్ మధ్యలోనే లండన్‌కి బయలుదేరనుంది.

చదవండి: Deepak Chahar: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్‌.. శుభలేఖ వైరల్‌..!

మరిన్ని వార్తలు