Pant-Urvashi Rautela: పంత్‌ త్వరగా కోలుకోవాలి: ఊర్వశి రౌతేలా

18 Feb, 2023 19:54 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌ 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంట్లోవాళ్లను సర్‌ప్రైజ్‌ చేద్దామని ఒంటరిగా ఢిల్లీ నుంచి సొంత గ్రామానికి బయల్దేరాడు. అయితే ఢిల్లీ-డెహ్రాడూన్‌ రహదారిపై రూర్కీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి పంత్‌కు పలు సర్జరీలు నిర్వహించారు.

ప్రస్తుతం పంత్‌ ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకునేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పంత్‌ ఈ ఏడాది క్రికెట్‌కు పూర్తిగా దూరమైనట్లే. ఇటీవలే పంత్‌ వాకింగ్‌స్టిక్స్‌ సాయంతో తాను నడుస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా భాగా వైరల్‌ అయ్యాయి.

ఇదిలా ఉండగా పంత్‌ త్వరగా కోలుకోవాలని టీమిండియా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రార్థిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కూడా పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించింది. శనివారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఊర్వశి ప్రత్యక్ష్యం కావడంతో ఫోటోగ్రాఫర్స్‌ ఆమెను చుట్టుముట్టారు. ఈ సమయంలో పంత్‌ విషయాన్ని ప్రస్తావించారు. 

ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ.. ''పంత్‌ మన దేశానికి పెద్ద ఆస్తి. అతను టీమిండియాకు ఆడడం దేశానికి గర్వకారణం. పంత్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అంటూ పేర్కొంది. గతంలో పంత్‌, ఊర్వశి రౌతేలా మధ్య లవ్‌ట్రాక్‌ నడుస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా వీరిద్దరి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు దృశ్యా ఆమె వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. 

మరిన్ని వార్తలు