Usain Bolt Cricket Entry: క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్‌ బోల్ట్‌

17 Sep, 2022 09:32 IST|Sakshi

ఉసేన్‌ బోల్ట్‌.. ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చేది చిరుత పులిని తలపించే వేగం. ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరుగుల వీరుడికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అథ్లెట్‌గా రిటైర్‌ అయిన బోల్ట్‌ త్వరలోనే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

చిన్నప్పటి నుంచి ఉసేన్‌ బోల్ట్‌కు క్రికెట్‌ అంటే విపరీతమైన ఇష్టం. క్రికెట్‌పై అమితమైన ప్రేమ ఉన్నప్పటికి పరిస్థితుల దృష్యా అథ్లెట్‌గా మారాల్సి వచ్చింది. తాజాగా క్రికెటర్‌ అవ్వాలన్న కలను బోల్ట్‌ త్వరలో నెరవేర్చుకోబోతున్నాడు. ఇప్పటికే క్రికెటర్‌గా మారడానికి క్రికెట్‌ కోచింగ్‌ పాఠాలు వింటూ ప్రాక్టీస్‌లో బిజీ అయ్యాడు.  ఇండియా మొట్టమొదటి లైవ్ డిజిటిల్ స్పోర్ట్స్ ఛానెల్ ‘పవర్ స్పోర్ట్స్’ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్లో బోల్ట్‌ ఆడనున్నాడు. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు బోల్ట్‌కు ఆహ్వానం పంపారు. 

న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి. మొదటి ఎడిషన్ ఇండియాలో జరపనున్న నిర్వాహకులు ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్‌ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు.

కాగా లీగ్‌లో పాల్గొననున్న ఎనిమిది జట్లకు ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ అని పేర్లు పెట్టారు. కాగా ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్భాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు.

మరిన్ని వార్తలు