కరోనాతో ‘షూటర్‌ దాదీ’ మృతి.. ప్రముఖుల సంతాపం 

1 May, 2021 07:57 IST|Sakshi
షూటింగ్‌ సమయంలో చంద్రో తోమర్‌తో తాప్సి, భూమి ఫడ్నేకర్‌

మీరట్‌: ఆరు పదుల వయసు దాటాక షూటింగ్‌ క్రీడలో ఓనమాలు నేర్చుకొని... ఆ తర్వాత జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధించి... ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ‘షూటర్‌ దాదీ’ చంద్రో తోమర్‌ కరోనా వైరస్‌ను జయించలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ జిల్లాకు చెందిన 89 ఏళ్ల చంద్రో తోమర్‌కు గత సోమవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శ్వాస సంబంధ సమస్యలతో ఆమెను మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా... ఐదు  రోజులపాటు మహమ్మారితో పోరాడిన ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

ఇక చంద్రో తోమర్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ పేరుతో సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా చంద్రో తోమర్‌ మృతికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి, రెండు ఒలింపిక్‌ పతకాలు నెగ్గిన భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్, భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంతాపం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు