47 పరుగులకే ఆలౌట్‌..

5 Nov, 2020 18:18 IST|Sakshi
ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్‌ సోఫీ ఎక్సీస్టోన్‌

మిథాలీ సేన ఘోర ఓటమి

మహిళల టీ20 చాలెంజ్‌

షార్జా:  మహిళల టీ20 చాలెంజ్‌ చరిత్రలో చెత్త రికార్డు నమోదైంది. గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెలాసిటి 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. దాంతో టోర్నీ చరిత్రలో అత్యల్ప స్కోరును తన పేరిట లిఖించుకుంది. ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్‌ సోఫీ ఎక్సీస్టోన్‌ దెబ్బకు వెలాసిటీ విలవిల్లాడింది. సోఫీ 3.1 ఓవర్లలో నాలుగు  వికెట్లు సాధించి వెలాసిటీ పతనాన్ని శాసించింది.  కేవలం 9 పరుగులకే ఇచ్చి 2.80 ఎకానమీతో అదరగొట్టింది.

వెలాసిటీ జట్టులో ముగ్గురు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశారు.అందులో ఫఫాలీ వర్మ(13) చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం.  వ్యాట్‌(3), మిథాలీ(1), వేదా(0),సుష్మా వర్మ(1)లు తీవ్రంగా నిరాశపరిచారు.  సోఫీకి జతగా గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు బౌలింగ్‌లో రాణించారు. జులన్‌ గోస్వామి, రాజేశ్వరిలు తలో రెండు వికెట్లు తీశారు. వెలాసిటీ నిర్ధేశించిన 48 పరుగుల టార్గెట్‌ను ట్రయల్‌బ్లేజర్స్‌ 7.5 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోయి ఛేదించింది. మంధనా(6) వికెట్‌ను ఆదిలో కోల్పోయినా దీంద్రా డాటిన్‌( 29 నాటౌట్‌), రిచా గోష్‌(13 నాటౌట్‌)లు టార్గెట్‌ను ఛేదించారు. కాగా, వెలాసిటీ నిన్న అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సూపర్‌ నోవాస్‌ జరిగిన మ్యాచ్‌లో​ వెలాసిటీ విజయం సాధించగా, దాన్ని ఈరోజు కొనసాగించలేకపోయింది.

మరిన్ని వార్తలు