అచ్చం ధోని తరహాలో..

20 Dec, 2020 10:14 IST|Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా వైఫల్యాన్ని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్‌ విధించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్‌ 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్‌ సాహా రనౌట్‌ చేశాడు. సాహా రనౌట్‌ చేసిన తీరు అచ్చం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనిని గుర్తుకుతెస్తుంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 18వ ఓవర్‌ రెండో బంతిని వేడ్‌ ఫ్లిక్‌ చేయగా.. అది కీపర్‌ సాహా చేతికి చిక్కింది. వెంటనే సాహా.. ధోని తరహాలో తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్ల​కు గిరాటేశాడు. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తిన వేడ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 96 ఏళ్ల చరిత్రను రిపీట్‌ చేశారు)

ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ' అలర్ట్‌.. అద్భుతమైన రనౌట్‌.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్‌ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న మొదలుకానుంది. విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరిన్ని వార్తలు