'గెట్‌ అవుట్‌ మ్యాన్‌' అంటూ పాక్‌ క్రికెటర్ అసహనం‌ 

27 Dec, 2020 10:51 IST|Sakshi

మౌంట్‌ మాంగనుయ్ ‌: కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్తాన్‌ బౌలర్‌ యాసిర్‌ షా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ హెన్రీ నికోల్స్‌పై‌ నోరు పారేసుకున్నాడు. ఆటలో మొదటిరోజు కివీస్‌ జట్టు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌, రాస్‌ టేలర్‌లు జిడ్డుగా బ్యాటింగ్‌ చేస్తూనే పరుగులు రాబట్టారు. 120 పరుగులు భాగస్వామ్యం అనంతరం 70 పరుగుల వద్ద రాస్‌ టేలర్‌ అవుట్‌ అయ్యాడు. అనంతరం వచ్చిన హెన్రీ నికోలస్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అలా కివీస్‌ 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. (చదవండి : సిరాజ్‌ కోసం ఉదయం 4 గంటలకే టీవీ ముందుకు..)

అయితే 90 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన పాక్‌ బౌలర్లు వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడ్డారు. షాహిన్‌ ఆఫ్రిది తప్ప ఏ ఒక్క బౌలర్‌ ఆకట్టుకోలేదు. అప్పటికే 16 ఓవర్లు వేసిన స్పిన్నర్‌ యాసిర్‌ షా 56 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. తీవ్ర అసహనంతో ఉన్న యాసిర్‌ షా 77వ ఓవర్లో  నికోల్స్పై మాట జారాడు. ఈ లెగ్‌ స్పిన్నర్‌ వేసిన డెలివరినీ నికోల్స్‌‌ కట్‌షాట్‌ ఆడదామని భావించాడు. అయితే బంతి మిస్‌ అయి కీపర్‌ చేతుల్లో పడింది. దీంతో చిర్రెత్తిపోయిన షా నికోల్స్‌ను ఉద్దేశించి 'ఔట్‌ ఓ జా బూత్నీకే'( గెట్‌ అవుట్‌ మ్యాన్‌) అంటూ గట్టిగా అరించాడు. అయితే షా అన్న మాట నికోల్స్‌కు అర్థం కాకపోవడంతో ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యాసిర్‌ షా చర్యను తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక 227/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ 155 ఓవర్లలో 431 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ విలియమ్‌సన్‌ 129 పరుగులు.. సెంచరీతో మెరవగా,  నికోల్స్‌ 56, కీపర్‌ వాట్లింగ్‌ 73 పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లో ఆఫ్రిది 4, యాసిర్‌ షా 3, అబ్బాస్‌, నసీమ్‌ షా, ఫహీమ్‌ అశ్రఫ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన పాక్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 30 పరుగులు చేసింది. అబీద్‌ అలీ 19, మహ్మద్‌ అబ్బాస్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : పైన్‌ అద్భుత క్యాచ్‌కు పుజారా బలి)

మరిన్ని వార్తలు