Vietnam Open Badminton: ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ జోడీ

29 Sep, 2022 06:00 IST|Sakshi

 సాయిప్రణీత్‌కు చుక్కెదురు

హో చి మిన్‌ సిటీ: వియత్నాం ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ ద్వయం 14–21, 21–9, 21–12తో హరిహరన్‌–లక్ష్మి ప్రియాంక (భారత్‌) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి.

2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత, 40వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన రెండో సీడ్‌ సాయిప్రణీత్‌ 21–17, 18–21, 13–21తో 225వ ర్యాంకర్‌ సతీశ్‌ కుమార్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ప్లేయర్‌ మేకల కిరణ్‌ కుమార్‌ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. తొలి రౌండ్‌లో కిరణ్‌ 21–10, 15–21, 21–10తో ప్రపంచ 68వ ర్యాంకర్‌ శుభాంకర్‌ డే (భారత్‌)పై నెగ్గి...రెండో రౌండ్‌లో 16–21, 21–14, 21–19తో ఫోన్‌ ప్యా నైంగ్‌ (మయాన్మార్‌)ను ఓడించాడు.

మరిన్ని వార్తలు