Vijay Hazare Trophy: తమిళనాడు చేతిలో ఆంధ్ర ఓటమి

14 Nov, 2022 05:58 IST|Sakshi

ఆలూర్‌ (కర్ణాటక): విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌లో తమిళనాడు తొమ్మిది వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (85; 9 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ శ్రీకర్‌ భరత్‌ (51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. తమిళనాడు బౌలర్లలో సిలాంబరాసన్‌ మూడు వికెట్లు తీయగా... సందీప్‌ వారియర్, సాయికిశోర్, సంజయ్‌ యాదవ్‌ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం తమిళనాడు ధాటిగా ఆడి 32.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 206 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ జగదీశన్‌ (114 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్‌ (73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జగదీశన్‌ తొలి వికెట్‌కు 177   పరుగులు జత చేశాడు.  

మరిన్ని వార్తలు