కోహ్లి ఆట గురించి ఆందోళన లేదు!

15 Feb, 2022 08:33 IST|Sakshi

కోల్‌కతా: భారత బ్యాటింగ్‌ స్టార్, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సుదీర్ఘ కాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సెంచరీ సాధించి రెండేళ్లు దాటగా ... ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అతను పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కోహ్లి విషయంలో తమకు ఎలాంటి ఆందోళన లేదని, త్వరలోనే అతను చెలరేగుతాడని భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

చదవండి: Washington Sundar: సుందర్‌ది దురదృష్టమే.. కాకపోతే చెప్పండి

‘కోహ్లి ఫామ్‌లో లేడనే మాటను నేను అంగీకరించను. విండీస్‌తో వన్డే సిరీస్‌లో విఫలమైనా అది పెద్ద విషయం కాదు. నెట్స్‌లో అతను ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతని సన్నద్ధత కూడా బాగుంది. త్వరలోనే ఒక గొప్ప ఇన్నింగ్స్‌తో తనేంటో కోహ్లి చూపిస్తాడు’ అని రాథోడ్‌ అభిప్రాయ పడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది చివర్లో జరిగే టి20 ప్రపంచకప్‌ కోసం తమ సన్నాహాలు మొదలైనట్లు అతను వెల్లడించాడు. విండీస్‌లో సిరీస్‌ గెలిచిన తర్వాతే ప్రయోగాలు, కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తామని విక్రమ్‌ రాథోడ్‌ స్పష్టం చేశాడు. 

చదవండి: Viral Video: వేలం సందర్భంగా సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్‌ ధర..!

మరిన్ని వార్తలు