Ahmed Shehzad: 'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం'

25 Jun, 2022 15:21 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెటర్లలో మంచి టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లలో అహ్మద్‌ షెహజాద్ ఒకడు. 2009లో 17 ఏళ్ల వయసులో పాక్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అహ్మద్‌ షెహజాద్‌ టాప్‌ ఆర్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చేవాడు. పాక్‌ తరపున షెహజాద్‌ 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2016లో టి20 ప్రపంచకప్‌ అనంతరం అహ్మద్‌ షెహజాద్‌పై వేటు పడింది.

ఇక చివరిసారి 2019లో పాక్‌ తరపున టి20 ఆడిన అహ్మద్‌ షెహజాద్‌ అప్పటినుంచి మళ్లీ జట్టులోకి రాలేదు. 2016 టి20 ప్రపంచకప్‌ అనంతరం అప్పటి పాక్‌ కోచ్‌ వకార్‌ యూనిస​ పీసీబీకి రిపోర్ట్‌ అందజేశాడు. ఆ రిపోర్ట్‌లో షెహజాద్‌తో పాటు ఉమ్రాన్‌ మాలిక్‌ పేర్లు జతచేర్చాడు. ఈ ఇద్దరిని జట్టు నుంచి తొలగిస్తే మంచిదని రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఈ కారణంతో అహ్మద్‌ షెహజాద్‌పై వేటు పడింది. ఆ తర్వాత క్రమంగా అతను జట్టుకు దూరమయ్యాడు.

తాజాగా అహ్మద్‌ షెహజాద్‌ తనను జట్టు నుంచి తీసివేయడంపై స్పందించాడు. ''టీమిండియా లాగా పాకిస్తాన్‌ క్రికెట్‌లో సీనియర్ల నుంచి మద్దతు లభించదు. దీనికి ఉదాహరణ టీమిండియాలో కోహ్లి- ధోనిలు. కోహ్లి ఫామ్‌ కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్‌.. సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని కోహ్లికి అండగా నిలబడ్డాడు. వరుసగా విఫలమవుతూ వస్తున్నా కోహ్లికి అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. ఆ తర్వాత కోహ్లి సూపర్‌ ఫామ్‌ అందుకొని తిరిగి రాణించాడు. కానీ దురదృష్టం కొద్ది పాకిస్తాన్‌లో అలా ఉండదు.

ఇక్కడ ఒక ఆటగాడు బాగా పరుగులు చేస్తున్నాడంటే సీనియర్లలో కుళ్లు, అసూయ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది నిజంగా దురదృష్టకరమనే చెప్పొచ్చు. నాపై రిపోర్ట్‌ ఇచ్చిన కమిటీని నేను తప్పు బట్టను. ఎందుకంటే పీసీబీ అడిగింది.. కమిటీ వాళ్ల డ్యూటీ చేసింది. కానీ రిపోర్ట్‌ ఇచ్చేముందు ఒకసారి నేరుగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఏది సరైనది.. ఏది తప్పు అనేది క్లియర్‌గా చెప్పాల్సింది. జట్టులో నేను అగ్రెసివ్‌గా ఉండడం మూలానా జట్టులో గొడవలు వస్తున్నాయని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని నాకు డైరెక్ట్‌గా చెప్పి ఉంటే పద్దతి మార్చుకునేవాడిని'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఇంగ్లండ్‌ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు!

మరిన్ని వార్తలు