IND VS SL: రోహిత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన కోహ్లి కోచ్‌.. మున్ముందు ముసళ్ల పండగ అంటూ హెచ్చరిక

2 Mar, 2022 17:03 IST|Sakshi

విరాట్‌ కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతంగా ఉందంటూనే.. సారధిగా అతనికి మున్ముందు ముసళ్ల పండగ ఉంటుందంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. హిట్‌మ్యాన్‌ ప్రశాంతమైన కెప్టెన్‌ అని, కెప్టెన్సీ చేపట్టిన కొద్దికాలంలోనే అద్భుత విజయాలు సాధించాడని పొగుడుతూనే.. అతను సాధించిన విజయాలు సులభంగా లభించాయని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. రోహిత్‌ సారధ్యంలో టీమిండియా ఇంకా సెట్‌ కాలేదని, ప్రతి సిరీస్‌కు జట్టును మారుస్తూ పోతుంటే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నాటికి జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని హెచ్చరించాడు. ఇటీవల కాలంలో ఒక్కో ఆటగాడు ఒక్కో సిరీస్‌లో రాణించాడని, ఇలా రాణించిన ఆటగాళ్లను రెస్ట్‌ పేరుతో పక్కకు పెట్టడం సబబు కాదని అభిప్రాయపడ్డాడు. 

ఇదే పరిస్థితి కొనసాగడం కెప్టెన్‌గా రోహిత్‌కు శుభపరిణామం కాదని, ఇలా ప్రయోగాలు చేసుకుంటూ పోతే, ఏదో ఒక సిరీస్‌లో జట్టు బొక్కబోర్లా పడటం ఖాయమని, అప్పుడు రోహిత్‌కు అసలు పరీక్ష మొదలవుతుందని పేర్కొన్నాడు. జట్టు ఓపెనర్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదని, ఒక్కో సిరీస్‌కు ఆటగాళ్లను మార్చుకుంటూ పోతే టీ20 ప్రపంచకప్‌ నాటికి జట్టు కూర్పు విషయంలో చాలా సమస్యలు వస్తాయని హెచ్చరించాడు. రోహిత్‌ సారధ్యంలో జట్టు ఇంకా కుదురుకోలేదని చెప్పడానికి ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయని ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, రోహిత్‌ సారధ్యంలో టీమిండియా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోహిత్‌ కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌తో మొదలైన టీమిండియా విజయపరంపర.. తాజాగా ముగిసిన శ్రీలంక సిరీస్‌ వరకు అప్రతిహతంగా కొనసాగింది. రోహిత్‌ నేతృత్వంలో టీమిండియా మార్చి 4 నుంచి లంకతో టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది.
చదవండి: భీకర ఫామ్‌లో కేకేఆర్‌ ప్లేయర్‌..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం
 

మరిన్ని వార్తలు