ఏంటి కోహ్లి..  ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ?

27 May, 2021 14:51 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పరుగుల యంత్రం.. సాకర్‌ను రెగ్యులర్ గా ఫాలో అవడమే కాకుండా..ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సహచర క్రికెటర్లతో కలిసి గేమ్ ను ఆస్వాధిస్తుంటాడు. అలాగే రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్‌లో కూడా ఫుట్‌బాల్‌తో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంటాడు. సాకర్ కు వీరాభిమానిగా చెప్పుకునే కోహ్లీ..  ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. 

కాగా , కోహ్లీ.. సాకర్ ఆడటంలో తనకున్న ప్రావీణ్యాన్ని తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశాడు. దీనికి 'యాక్సిడెంటల్ క్రాస్‌బార్ ఛాలెంజ్'అనే క్యాప్షన్‌ జోడించాడు. ఈ వీడియోలో కోహ్లీ కొట్టిన ఓ ఫ్రీ కిక్‌.. క్రాస్‌బార్‌కు తగిలి గోల్ పోస్ట్ ఆవలకు వెళ్ళింది. అయితే ఈ షాట్ కొట్టిన అనంతరం ..  తనను తానే నమ్మడం లేదన్నట్లుగా కోహ్లీ తన హావభావాలు ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. .

ఈ వీడియో చూసిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రీ కూడా కోహ్లీ ఫుట్‌బాల్ స్కిల్స్‌కు ఫిదా అయ్యాడు. తనకు గురు దక్షిణ చెల్లించాలని సరదగా కోరాడు. ఫీజు మొత్తాన్ని ఒకే చెల్లిస్తావా.. ? లేక ఈఎంఐ లేమైనా కావాలా.. ? అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి కోహ్లీ కూడా తనదైన శైలిలో స్పందించాడు. 'మీరు ఎంజాయ్ చేయండి కెప్టెన్' అంటూ రీట్వీట్ చేసాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కాగా, సునీల్ ఛెత్రీ, కోహ్లీ చాలాకాలంగా మంచి స్నేహితులు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ముంబైలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉన్నాడు.  
చదవండి: ప్రపంచ క్రికెట్లో వీళ్ళే మొనగాళ్లు.. వీళ్లతో చాలా కష్టం

మరిన్ని వార్తలు