Virat Kohli: విరాట్‌ సరికొత్త రికార్డు.. ‘నువ్వు ఎప్పుడూ కింగ్‌ కోహ్లివే భాయ్‌’!

8 Jun, 2022 09:53 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: Virat Kohli Instagram)

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి రికార్డులేమీ కొత్తకాదు. అయితే, ఈసారి ఆటలో కాకుండా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాలో 200 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి భారతీయ వ్యక్తిగా చరిత్రకెక్కాడు ఈ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు.

అదే విధంగా ఫొటో, వీడియో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. స్టార్‌ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో 451 మిలియన్లు, లియోనల్‌ మెస్సీ 334 ఫాలోవర్లతో కోహ్లి కంటే ముందున్నారు.‌

ఈ సందర్భంగా..‘‘ 200 మిలియన్ల మంది! నాకు మద్దతుగా నిలుస్తున్న ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు’’ అంటూ ఫాలోవర్లను ఉద్దేశించి కోహ్లి ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘కంగ్రాట్స్‌ భాయ్‌.. మా గుండెల్లో నీ స్థానం ఎప్పుడూ పదిలం.. నువ్వు ఎల్లప్పుడూ మాకు కింగ్‌ కోహ్లివే’’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లిని... ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఘోర పరాజయం నేపథ్యంలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ దక్కగా.. కోహ్లి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నా అభిమాన గణాన్ని మాత్రం పెంచుకుంటూనే పోతున్నాడు ఈ ‘రన్‌ మెషీన్‌’! ఇక 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న సమయంలో కోహ్లి ఒక్కో పోస్టుకు 5 కోట్ల రూపాయల మేర ఆర్జిస్తున్నాడంటూ విశ్లేషకులు అంచనాలు వేసిన విషయం తెలిసిందే.

చదవండి: ‘వారి విలువేమిటో బాగా తెలుసు’.. టీమిండియా టాప్‌–3పై ద్రవిడ్‌ వ్యాఖ్య

A post shared by Virat Kohli (@virat.kohli)

A post shared by Cristiano Ronaldo (@cristiano)

A post shared by Leo Messi (@leomessi)

>
మరిన్ని వార్తలు