Virat Kohli: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు..

15 Jul, 2022 21:58 IST|Sakshi

విరాట్‌ కోహ్లి సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అదిగో చేస్తాడు.. ఇదిగో చేస్తాడు అని మనం అనుకుంటున్న ప్రతీసారి నిరాశపరుస్తూనే వస్తున్నాడు. అతని సెంచరీ కోసం అటు అభిమానులు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి ఆశలు వదిలేసుకున్నారు. తాజాగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో బీసీసీఐ వెస్టిండీస్‌తో జరగనున్న టి20, వన్డే సిరీస్‌లకు కోహ్లిని పక్కనబెట్టింది. ఇదిలా ఉంటే కోహ్లి వీరాభిమాని ఒకరు అతను సెంచరీ చేయాలని ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పొట్లాలను అందించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కోహ్లీ వీరాభిమాని అయిన ఓ మహిళ.. అతడి పేరు మీద ఆహార పొట్లాలను అందజేస్తున్నది. కోహ్లీ ఎలాగైనా సెంచరీ కొట్టాలని గత కొద్దిరోజులుగా ఆకలితో అలమటించేవారికి అన్నం పెడుతున్నది. ట్విటర్ లో ఓ  నెటిజన్ ఇందుకు సంబంధించిన విషయాన్ని షేర్ చేశాడు. ఫామ్ కోల్పోయి అందరి చేత మాటలు పడుతుంటే ఆమె మనసు విలవిల్లాడింది. వంద ఇన్నింగ్స్‌లకు పైగా సెంచరీ కొట్టలేక చతికిలపడుతున్న కోహ్లీకి పుణ్యం దక్కాలని ఆమె ప్రయత్నిస్తున్నది.

ఆ పొట్లాల మీద ‘కోహ్లీ 71వ సెంచరీ కోసం’ అని రాసి ఉండటం గమనార్హం. తాను పుణ్యం చేస్తేనైనా ఆ పుణ్యఫలం కోహ్లికి అంది తద్వారా  అతడు మళ్లీ మునపటి కోహ్లీలా అదరగొడతాడని సదరు మహిళ విశ్వాసం.  అందులో భాగంగానే రోడ్లమీద ఉంటూ ఆహారం కోసం అలమటిస్తున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు ఆహార పొట్లాలను పంచుతున్నది. మరి ఈ పుణ్యం  కోహ్లీకి దక్కి వచ్చే మ్యాచుల్లో అయినా అతడు సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

చదవండి: IRE vs NZ: కివీస్‌ కొంపముంచిన టవల్‌.. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!

గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగుతారా? వారంలో వీడనున్న ఉత్కంఠ

>
మరిన్ని వార్తలు