Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం

11 Oct, 2021 22:30 IST|Sakshi

Virat Kohli Argument With Umpire Virender Sharma.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లి తనకు ఇదే చివరి సీజన్‌ అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా కప్‌ అందించి కోహ్లికి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఆర్‌సీబీ భావిస్తోంది. కాగా కేకేఆర్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడితే ఆర్‌సీబీ ఇంటిబాట పడుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ ఆర్‌సీబీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ కాపాడుకునే అవకాశం ఉండడంతో ఆర్‌సీబీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్‌ బ్యాటర్‌ ఔట్‌ నిర్ణయంపై అంపైర్‌ తీరుపై కోహ్లి వాగ్వాదానికి దిగాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ చహల్‌ వేశాడు. ఓవర్‌ ఆఖరి బంతిని త్రిపాఠి పుల్‌ చేయబోయి మిస్‌ అయ్యాడు. దీంతో బంతి ప్యాడ్లను తాకింది. చహల్‌ ఎల్బీకి అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ వీరేందర్‌ శర్మ నాటౌట్‌ ఇచ్చాడు. చహల్‌ అప్పీల్‌తో కోహ్లి వెంటనే రివ్యూ కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి మొదట ప్యాడ్లను తాకి నేరుగా లెగ్‌స్టంప్‌ను ఎగరగొట్టినట్లు స్పష్టంగా కనిపించడంతో త్రిపాఠి అవుట్‌ అని తేలింది.

దీంతో కోహ్లి ఓవర్‌ ముగిసిన తర్వాత అంపైర్‌ వీరేందర్‌ శర్మ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాసేపు ఇద్దరి మధ్య సీరియస్‌ చర్య నడిచింది. అనంతరం కోహ్లి నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. 

చదవండి: Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌ కొత్త చరిత్ర.. ఆర్‌సీబీ తరపున తొలిసారి

మరిన్ని వార్తలు