Virat Kohli: 'అంచనాలు అందుకోవాలంటే కొన్ని విషయాలు పట్టించుకోవద్దు'

20 May, 2022 11:42 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రెండో అర్థసెంచరీ మార్క్‌ అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడిన షాట్స్ చాలా రోజుల తర్వాత పాత కోహ్లిని గుర్తుకుతెచ్చాయి. 54 బంతుల్లో  8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేశాడు. ఒకరకంగా ఆర్‌సీబీ మ్యాచ్‌ గెలవడంలో కోహ్లి మంచి పునాది వేశాడు. ఆఖర్లో ఔటైనప్పటికి అప్పటికే ఆర్‌సీబీని పటిష్ట స్థితిలో నిలిపాడు. దీంతో చివర్లో మ్యాక్స్‌వెల్‌ 18 బంతుల్లో 40 పరుగులు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ విజయం అనంతరం కోహ్లి తన ఆటతీరుపై స్పందించాడు.

''ఐపీఎల్‌ 2022 సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయా. ప్రతీసారి మంచి ప్రదర్శన చేసిన నాకు గణాంకాలు చూసి ఆశ్చర్యమేసింది. జట్టు కోసం రాణించలేకపోయాననే విషయం ఎక్కువ బాధ కలిగించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మా జట్టుపై నా ఆట చాలా ప్రభావం చూపించింది. దీంతో చేజింగ్‌ సమయంలో జట్టు మంచి స్థితిలో కనిపించింది. మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడం వెనుక ఇంతకముందు నేను ఆడిన విధానమే. మన ఆలోచనా విధానాన్ని సరైన దిశలో ఉంచుకుంటే మంచిది. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే పనికిమాలిన విషయాలు పట్టించుకోవద్దు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రిలాక్స్‌- ఫ్రీ మూడ్‌లో ఆడాలని ముందే అనుకున్నా. అందుకు తగ్గట్టుగానే నా ఇన్నింగ్స్‌ కొనసాగింది.

దీని వెనుక చాలా శ్రమ దాగుంది. మ్యాచ్‌లో రాణించేందుకు నెట్స్‌లో 90 నిమిషాల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. అది చాలా ఉపయోగపడింది. షమీ వేసిన తొలి ఓవర్లోనే కొన్ని మంచి షాట్లు ఆడడంతో బాగా ఆడగలననే నమ్మకం వచ్చింది. ఆ తర్వాత బౌండరీలతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతూ పరుగులు రాబట్టాను. ఈ సీజన్‌లో నేను విఫలమైనప్పటికి అభిమానుల నుంచి మద్దతు మాత్రం గట్టిగా లభించింది. వారి ప్రేమకు ఎల్లప్పుడు రుణపడి ఉంటా'' అంటూ పేర్కొన్నాడు. 

చదవండి: Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు