Virat Kohli: ఫేక్‌ ఫీల్డింగ్‌ ముమ్మాటికీ తప్పే.. ఈసారి తప్పించుకున్నాం: భారత మాజీ క్రికెటర్‌

4 Nov, 2022 17:02 IST|Sakshi
PC: Twitter/Disney+Hotstar

T20 WC 2022 Ind Vs Ban- Virat Kohli: ‘‘ఐసీసీ ప్రాథమిక నిబంధన ప్రకారం.. మైదానంలో ఫీల్డర్‌.. తన సమీపంలో బంతి లేనప్పటికీ ఫేక్‌ త్రో ద్వారా గానీ.. డైవ్‌ చేస్తున్నట్లు గానీ నటించి బ్యాటర్ల దృష్టిని మరల్చేలా చేయడం ముమ్మాటికీ తప్పే. బ్యాటర్ల దృష్టిని సదరు ఫీల్డర్‌ ఆకర్షించాడా లేడా అన్న విషయం పక్కన పెడితే.. ఫేక్‌ ఫీల్డింగ్‌ జరిగినట్లు అంపైర్లు గుర్తిస్తే పెనాల్టీ రూపంలో బ్యాటింగ్‌ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు ఇవ్వాల్సిందే.

ఏదైనా జరిగి ఉండేది
ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆ ఐదు పరుగులు ఇచ్చి ఉంటే.. బంగ్లాదేశ్‌ బ్యాటర్లు తీసిన పరుగు కూడా కౌంట్‌లోకి వచ్చేది. ఒకవేళ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తే.. మరుసటి బంతికి ఎవరు స్ట్రైక్‌ తీసుకోవాలా అన్న విషయం గురించి బంగ్లా ఆలోచించుకునేది. ఈ ఘటన తర్వాత మ్యాచ్‌లో ఏదైనా జరిగి ఉండేది.

అయితే, అక్కడేం జరిగిందంటే.. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ ఈ విషయాన్ని గమనించలేదు. ఫేక్‌ ఫీల్డింగ్‌ అన్న విషయం అసలు వాళ్ల దృష్టికే రాలేదు. మైదానంలో ఎవరూ దీనిని గురించి పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం అంపైర్లు ఇలాంటి వాటిని గమనించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఉండాల్సింది. ఒకవేళ థర్డ్‌ అంపైర్‌ పరిధిలో గనుక ఈ అంశం ఉండి.. నిబంధనలకు లోబడి.. జోక్యం చేసుకునే వీలుంటుంది. 

వందకు వంద శాతం
నిజం చెప్పాలంటే అది వందకు వంద శాతం ఫేక్‌​ ఫీల్డింగే! తన సమీపంలో బంతి లేకున్నా అతడు బంతిని విసిరినట్లుగా నటించాడు. ఒకవేళ అంపైర్‌ ఈ విషయాన్ని గమనించి ఉంటే మనకు ఐదు పరుగుల పెనాల్టీ పడేది. అయినా మనం ఐదు పరుగుల తేడాతో గెలిచేవాళ్లం.

ఈసారికైతే తప్పించుకోగలిగాం. కానీ తదుపరి మ్యాచ్‌లలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే అంపైర్లు తప్పక గమనించాలి. వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి బంగ్లా జట్టు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? అవును కచ్చితంగా వాళ్లు సరిగ్గానే చెప్పారు. అయితే, ఆ విషయాన్ని మైదానంలో ఎవరూ గమనించలేదు కాబట్టి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అసలేం జరిగింది?
తమతో మ్యాచ్‌ సందర్భంగా భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ బంగ్లాదేశ్‌ చేసిన ఆరోపణలను సమర్థించాడు. కాగా ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం 16 ఓవర్లకు కుదించి 151 పరుగుల టార్గెట్‌ విధించారు. ఈ క్రమంలో భారత్‌ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఇదిలా ఉంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో కోహ్లి తన దగ్గర బంతి లేకపోయిన్పటికీ త్రో చేసినట్లుగా ఉన్న వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఈ ఘటనపై మ్యాచ్‌ అనంతరం స్పందించిన బంగ్లా ఆటగాడు నూరుల్‌ హసన్‌.. కోహ్లి ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ ఆరోపించాడు. బంగ్లా ఫ్యాన్స్‌ సైతం ఇదే తరహాలో టీమిండియా గెలుపును తక్కువ చేసి చూపేలా ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లి వల్ల బ్యాటర్ల దృష్టి మరలలేదు.. కాబట్టి పెనాల్టీ విధించాలనడం సరైంది కాదని కొంతమంది టీమిండియాను సపోర్టు చేస్తున్నారు. 

ఆయన అలా... ఈయన ఇలా
భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సైతం ఈ అంశంపై తన స్పందన తెలియజేస్తూ.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ ఘటనపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పైవిధంగా స్పందించాడు. బంగ్లాను సమర్థించే విధంగా మాట్లాడుతునే టీమిండియా ఐదు పరుగుల తేడాతో గెలిచేదంటూ కామెంట్‌ చేయడం గమనార్హం.

ఇందుకు బదులుగా టీమిండియా ఫ్యాన్స్‌ ఈ కామెంటేటర్‌పై సెటైర్లు వేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. బంగ్లా ఫ్యాన్స్‌ మాత్రం సరిగ్గా చెప్పారంటూ ఆకాశ్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి (64- నాటౌట్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్‌ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్‌ దిగ్గజం.. అయితే!
T20 WC 2022 NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్‌!
Kohli Fake Fielding: డిస్టర్బ్‌ అయినట్లు కనిపించలేదు.. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఇవ్వలేదు 

మరిన్ని వార్తలు