క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు 'కింగ్‌ కోహ్లి'.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం

23 Jan, 2023 21:34 IST|Sakshi

Virat Kohli: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం, కింగ్‌ విరాట్‌ కోహ్లి క్రికెట్‌ చర్రితలో ఏ ఆటగాడికి సాధ్యం కాని ఓ అత్యంత అరుదైన ఘనతను ఇవాళ (జనవరి 23) సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న కోహ్లి.. ఐసీసీ మూడు ఫార్మాట్ల క్రికెట్‌ జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

2012, 2014, 2016, 2017, 2018, 2019 ఐసీసీ వన్డే జట్లలో చోటు సంపాదించిన కింగ్‌.. 2017, 2018, 2019 ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ల్లోనూ సభ్యుడిగా ఎంపిక కాబడ్డాడు. తాజాగా 2022 ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న రన్‌మెషీన్‌.. ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ (3), వన్డే (6), టీ20 జట్ల (1)లో భాగమైన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కింగ్.. ఆసియాకప్-2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై సూపర్‌ సెంచరీ, టీ20 వరల్డ్‌కప్‌-2022లో పాకిస్తాన్‌పై అజేయమైన హాఫ్‌సెంచరీ తదితర మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి బెస్ట్‌ టీ20-2022 జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది సూపర్‌ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్న కోహ్లి.. 2023లో వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.

ఈ ఏడాది వన్డేల్లో కింగ్‌ ఇప్పటికే 2 సెంచరీలు (శ్రీలంకపై) బాదాడు. న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరం‍గా ఉంటున్న పరుగుల యంత్రం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే 4 మ్యాచ్‌లో టెస్ట్‌ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు.

కాగా, ఐసీసీ ప్రకటించిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు కోహ్లితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యాలకు కూడా చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు సారధి జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 
 

మరిన్ని వార్తలు