Kohli Emotional Post: మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం

11 Nov, 2022 11:41 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా కథ సెమీస్‌లో ముగిసింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్‌ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. మరోసారి నిరాశతో ఇంటిముఖం పట్టింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో రోహిత్‌ సేన ఘోర ఓటమిని చవి చూసింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఇక మెగా టోర్నీ నుంచి ఇంటి దారి పట్టిన భారత జట్టుపై అభిమానులు, మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఓటమిపై స్పందిస్తూ భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో  భావోద్వేగ పోస్టు చేశాడు.

"మా కలను సాకారం చేసుకోకుండానే ఆస్ట్రేలియన్ తీరాలను వీడాల్సి వస్తోంది. ఇందుకు మేము చాలా బాధపడుతున్నాము. అయితే ఎన్నో చిరస్మరణీయ జ్ణాపకాలను మా వెంట తీసుకువస్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకుటున్నాం.

మాకు మద్దుతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులందరికీ ధన్యవాదాలు. భారత జెర్సీ ధరించి, దేశానికి వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తాను"  అని విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. 

కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టు బాధ్యతను తన భుజాలపై విరాట్‌ వేసుకున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు కోహ్లి సాధించాడు.

తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. అదే విధంగా ఈ టోర్నీలో టాప్‌ రన్‌ స్కోరర్‌గా కూడా విరాట్‌ కోహ్లి(296)నే కొనసాగుతున్నాడు.

A post shared by Virat Kohli (@virat.kohli)


చదవండి: IND vs NZ: టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

మరిన్ని వార్తలు