ఒక్క టెస్ట్‌.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే

2 Feb, 2021 17:52 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరగనున్న మొదటి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఒక్క టెస్టు మ్యాచ్‌ ద్వారా మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం కోహ్లికి లభించనుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. టీమిండియా మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ముద్రపడిన ఎంఎస్‌ ధోనీ రికార్డును సమం చేసే అవకాశం కోహ్లికి లభించింది. కెప్టెన్‌గా ధోని స్వదేశంలో టీమిండియాకు 21 విజయాలు సాధించిపెట్టాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 20 విజ‌యాలు ఉన్నాయి. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా మొదటి టెస్టు మ్యాచ్‌ గెలిస్తే ధోనీని స‌మం చేస్తాడు. చదవండి: క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. లాభపడిన కివీస్

దీంతో పాటు  కెప్టెన్‌గా టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానానికి ఎగ‌బాక‌డానికి కోహ్లి 14 ప‌రుగుల అవసరం ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ కోహ్లి టెస్టుల్లో కెప్టెన్‌గా 5220 ప‌రుగులు చేశాడు. మ‌రో 14 ప‌రుగులు చేస్తే.. విండీస్ దిగ్గ‌జం క్లైవ్ లాయిడ్ రికార్డును కోహ్లి అధిగ‌మిస్తాడు. కోహ్లి, లాయిడ్ కంటే ముందు గ్రేమ్ స్మిత్ (8659), అల‌న్ బోర్డ‌ర్ (6623), రికీ పాంటింగ్ (6542) ఉన్నారు. ఇక మూడో రికార్డు ఏంటంటే.. ఒకవేళ ఇంగ్లండ్‌తో జరగనున్న మొదటి టెస్టులో కోహ్లి సెంచరీ సాధిస్తే కెప్టెన్‌ హోదాలో(వన్డే, టెస్టులు) కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.కోహ్లి ఇప్పటివరకు కెప్టెన్‌గా 41 సెంచరీలు చేయగా.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు.
చదవండి: కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?

టీమిండియా తరపున కోహ్లి 87 టెస్టుల్లో 7318 పరుగులు, 251 వన్డేల్లో 12040 పరుగులు, 85 టీ20ల్లో 2928 పరుగులు చేశాడు. టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 శతకాలు సాధించాడు. కాగా ఇంగ్లండ్‌, భారత్‌ల మ‌ధ్య తొలి టెస్ట్ ఫిబ్ర‌వ‌రి 5 నుంచి చెన్నైలో జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. 

మరిన్ని వార్తలు