హార్దిక్‌కు బౌలింగ్‌ ఇవ్వకపోవడానికి కారణం అదే.. : కోహ్లి

27 Mar, 2021 12:23 IST|Sakshi

పుణే: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసింది. బెయిర్‌ స్టో, స్టోక్స్‌ విధ్వంసం దాటికి ఇంగ్లండ్‌ ఇంకా 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. కాగా భారత్‌ బౌలర్లంతా ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్‌ చేయించిన విరాట్‌ కోహ్లి హార్దిక్‌ చేత బౌలింగ్‌ ఎందుకు వేయించలేదనే దానిపై మ్యాచ్‌ అనంతరం స్పందించాడు.

''భవిష్యత్తు ప్రణాళిక దృష్యా హార్దిక్‌ను ప్రస్తుతం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేశాం. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రానున్న రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు టీ20 వరల్డ్‌ కప్‌ ఆడనున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని అతనిపై ఎక్కువ భారం వేయకూడదనే నిర్ణయానికి వచ్చాం. పాండ్యా సేవలు ఎప్పుడు ఎక్కడా వాడాలనే దానిపై మాకు పూర్తి క్లారిటీ ఉంది. అతని బ్యాటింగ్‌ నైపుణ్యంతో పాటు బౌలింగ్‌ సేవలు కూడా మాకు చాలా అవసరం. అందుకే ఈ సిరీస్‌లో అతనితో బౌలింగ్‌ చేయించడం లేదు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్యా కీలకం కానున్నాడు. అప్పటివరకు అతను ఎంత ఫిట్‌గా ఉంటే మాకు అంత మేలు జరుగుతుంది.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్‌ పరంగా మేము అద్భుతంగా ఉన్నాము. వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశా. ఆ తర్వాత రాహుల్‌, పంత్‌లు కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ నిజంగా అద్బుతం. తనపై వస్తున్న విమర్శలకు రాహుల్‌  ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. రిషబ్‌ పంత్‌ ఎప్పటిలాగే దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగి భారీ స్కోరుకు బాటలు వేశాడు. అయితే పూర్తిగా బ్యాటింగ్‌ సహకరిస్తున్న పిచ్‌పై బౌలర్లు ఎలాంటి అద్భుతాలు చేయలేరు. బౌలర్లు అంతా విఫలమయ్యారన్నది నిజమే.. కానీ తప్పంతా వారిదే అని మాత్రం అనలేను. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక నేను సెంచరీల కోసం మ్యాచ్‌లు ఆడడం లేదని.. ఒక కెప్టెన్‌గా.. ఆటగాడిగా జట్టును నడిపించడమే బాధ్యతగా పెట్టుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే రేపు(ఆదివారం మార్చి 28న) జరగనుంది. 
చదవండి:
అప్పుడు కృనాల్,‌ టామ్‌.. ఇప్పుడు హార్దిక్‌, సామ్
బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఏం చేశాడంటే!

మరిన్ని వార్తలు