IND Vs SA: టీమిండియాకు మరో షాక్‌.. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి! ఎందుకంటే!

14 Dec, 2021 10:40 IST|Sakshi

Virat Kohli set to Miss a ODI series: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించి రోహిత్‌ శర్మకు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న కోహ్లి.. వన్డే, టెస్ట్‌లకు సారధి కొనసాగుతానని తెలిపాడు. ఈ క్రమంలో అనూహ్యంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విరాట్‌ను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో సాఫారీ గడ్డపై జరిగే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరో వైపు జనవరిలో తన కుమార్తె వామిక బర్త్‌డే ఉండడంతో.. కోహ్లి తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కాగా టెస్ట్‌ సిరీస్‌ అనంతరం  జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. అదే సమయంలో తన గారాల పట్టి వామిక తొలి పుట్టిన రోజు ఉండడంతో కోహ్లి సిరీస్‌ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ విషయం గురించి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని.. వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనని చెప్పినట్లు సమాచారం.

ఓ నెటిజన్ స్పందిస్తూ.."ఇది నిజంగా వినడానికి చాలా షాకింగ్‌గా ఉంది. టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం కాగా, ఇప్పుడు విరాట్‌ కూడా వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. విరాట్ తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నాడు. జనవరిలో తన కుమార్తె  వామికా మెదటి బర్త్‌డే ఉంది. అందుకే కోహ్లి వన్డేలకు దూరం ఉండాలని భావిస్తున్నాడు"అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా రోహిత్‌ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు.

చదవండి: Trolls On Rohit Sharma: వైస్‌ కెప్టెన్‌ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ!

మరిన్ని వార్తలు