IPL 2022: 'ముంబై గెలవాలంటే అతడు జట్టులోకి రావాల్సిందే'

8 Apr, 2022 11:35 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2022లో పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఈ ఏడాది సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది ముంబై ఘోర పరాభవం మూట కట్టుకుంది. కాగా ముంబై జట్టు బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటటికీ.. పేస్‌ బౌలింగ్‌లో మాత్రం అంతగా రాణించలేక పోతుంది. జస్ప్రీత్‌ బుమ్రా తప్ప మిగితా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.  కాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. జయదేవ్ ఉనద్కత్‌ను ముంబై తుది జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ఐపీఎల్‌ చరిత్రలో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఉనద్కత్‌ను బెంచ్‌కే ఎందుకు పరిమితం చేస్తున్నారో అర్ధం కావడంలేదు అని తెలిపాడు.

"గత ఏడాది సీజన్‌ వరకు ముంబై జట్టులో నాథన్ కౌల్టర్ నైల్ ఉండేవాడు. జట్టులో ఏ బౌలరైనా బాగా రాణించకపోయినా లేదా గాయపడినా కౌల్టర్ నైల్ జట్టులోకి వచ్చేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ముంబై మేనేజ్‌మెంట్ బెంచ్‌లో ఉన్నవారికి తుది జట్టులో అవకాశం ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్ వంటి వారు ఇంకా బెంచ్‌కే పరిమితం అవుతున్నారు. అంతే కాకుండా సంజయ్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్ వంటి యువ పేసర్‌లు కూడా జట్టులో ఉన్నారు. జట్టులో బాసిల్ థంపి, డేనియల్ సామ్స్‌ అంతగా రాణించడం లేదు. వీరిద్దరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం​ ఇవ్వాలి.

కాగా ముంబై మాత్రం తమ తుది జట్టులోకి జయదేవ్ ఉనద్కత్‌ను తీసుకునే సమయం వచ్చింది. అతడికి ఐపీఎల్‌లో చాలా అనుభవం ఉంది. గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా ఐపీఎల్ 2018 వేలంలో ఉనద్కత్‌  11.5 కోట్లకు అమ్ముడు పోయాడు. అయితే అతడు తన తర్వాత సీజన్‌లో అంతగా రాణించలేక పోయాడు. అయినప్పటికీ ఐపీఎల్‌లో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా బుమ్రాకు అతడే సరైన జోడి" అని నేను భావిస్తున్నాను. 

చదవండి: IPL 2022: పంత్‌ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అసలు ఇలా ఎందుకు చేశాడో?

మరిన్ని వార్తలు