T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్‌ కాదు.. దినేశ్‌ కార్తిక్‌పై సెహ్వాగ్‌ సెటైర్లు! ఇప్పటికైనా

31 Oct, 2022 11:01 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరజాయం పాలైంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ప్రోటీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌(59) అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. ఇక భారత్‌ బ్యాటర్లలో సూర్య కుమార్‌ యాదవ్‌(68) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.

కాగా జట్టులో ఫినిషర్‌గా చోటు దక్కించుకున్న దినేష్‌ కార్తీక్‌ ఈ మెగా టోర్నీలో తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అదే విధంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా 15 బంతులు ఆడిన డికే కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఈ క్రమంలో పంత్‌ను కాదని కార్తీక్‌కు తుది జట్టులో చోటువ్వడంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్‌ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కార్తీక్‌ కంటే రిషబ్ పంత్‌కే ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

"కార్తీక్‌ స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని తొలి మ్యాచ్‌ నుంచే నేను చెబుతున్నాను. రిషబ్‌ ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో ఎలా రాణించాలో పంత్‌కు బాగా తెలుసు. దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడి చాలా కాలమైంది. అతడికి ఇటువంటి బౌన్సీ పిచ్‌లపై ఆడిన అనుభవం అస్సలు లేదు.

ఇదేమి బెంగళూరు వికెట్‌ కాదు, నేరుగా బంతి బ్యాట్‌పైకి రావడానికి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో నైనా కనీసం హుడా స్థానంలోనైనా పంత్‌ను తీసుకోవాల్సింది. గతంలో పంత్‌ గబ్బాలో ఆడిన ఇన్నింగ్స్‌ ఇప్పటికీ ప్రతీ ఒక్క గుర్తుంది. ఇప్పటికైనా మేనేజ్‌మెంట్‌ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలి" అని క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌ గాయపడ్డాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో జరిగే భారత్‌ తదుపరి మ్యాచ్‌కు కార్తీక్‌ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.


చదవండి: T20 World Cup 2022: ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు