కోహ్లి సెంచరీల కొరత.. సెహ్వాగ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 Aug, 2021 16:39 IST|Sakshi

లార్డ్స్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించి దాదాపు రెండేళ్లవుతుంది. క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లికి సెంచరీలు లేకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీల కొరతపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో  పంచ్‌లు విసిరాడు. 99.99, 99.97 పర్సంటేజ్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరు స్టూడెంట్స్ మెరుగైన మార్కుల కోసం మళ్లీ పరీక్ష రాసారనే వార్తను షేర్ చేస్తూ ఇది కోహ్లీకి కూడా వర్తిస్తుందంటూ సెటైర్లు పేల్చాడు.

కోహ్లీ కూడా సెంచరీ సాధిస్తేనే అభిమానులు సంతోషంగా ఉంటారని, అలా కాదని ఎన్ని పరుగులు చేసినా.. అతను ఫామ్‌లో లేనట్లేననే ఉద్దేశంలో ట్వీట్ చేశాడు. మృదుల్ అగర్వాల్, కావ్య చోప్రా అనే ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి జరిగిన జేఈఈ పరీక్షలో 99.99, 99.97 పర్సంటేజ్ సాధించారు. ఈ ఫలితాలకు సంతృప్తి పడని వారు మళ్లీ పరీక్షలు రాసి 100 పర్సంటేజ్ సాధించారు. 300 మార్కులు 300 సాధించారు. రోజులు 6-8 గంటలు చదివేవాళ్లమని చెప్పారు.

కాగా కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. నాటింగ్‌హమ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో​ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆడే అవకాశం రాలేదు. ఇక లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు