T20 World Cup 2022: 'రిజ్వాన్‌, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్‌ టాప్ రన్ స్కోరర్‌'

21 Oct, 2022 11:09 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 తొలి రౌండ్‌(క్వాలిఫియర్స్‌) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్‌-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు సూపర్‌-12 అర్హత సాధించగా.. గ్రూప్‌-బి భవితవ్యం శుక్రవారం తేలిపోనుంది. ఇక శనివారం(ఆక్టోబర్‌-22) నుంచి  సూపర్‌-12 సమరం ప్రారంభం కానుంది. సూపర్‌-12లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు సిడ్నీ వేదికగా తలపడనున్నాయి

అనంతరం ఆదివారం(ఆక్టోబర్‌ 23)న మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌, భారత్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గతేడాది ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

ఇక భారత్‌-పాకిస్తాన్‌ హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం నిలుస్తాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్‌ ఆజం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ ట్రై సిరీస్‌లో బాబర్‌ అదరగొట్టాడు.

క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అద్భుతమైన బ్యాటింగ్‌ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. అతడు ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చూస్తుంటే మనం ఎంత కూల్‌గా ఉంటామో.. బాబర్‌ బ్యాటింగ్‌ను చూసిన కూడా అదే భావన కలుగుతుంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్‌ నిలిచే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు.


చదవండి: T20 WC 2022: 'అతడు ఒంటి చేత్తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందిస్తాడు'

మరిన్ని వార్తలు