IPL 2023 GT Vs MI: ముంబై ఆటగాడు అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలి సారి!

27 May, 2023 11:32 IST|Sakshi

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు విష్ణు వినోద్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్‌-2లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన విష్ణు వినోద్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కంటికి గాయమైంది. దీంతో కిషన్‌ బ్యాటింగ్‌ రాలేదు. ఈ క్రమంలో  అతడి స్థానంలో విష్ణు వినోద్‌ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కాగా ఈ సబ్‌స్టిట్యూట్‌షన్‌ రూల్‌ను ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్రవేశపెట్టారు. ఇక సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన  వినోద్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌ చేతిలో 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. తద్వారా ప్లేఆప్స్‌లోనే ముంబై కథముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుబ్‌మన్‌ గిల్‌(129) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 171 పరుగులకే ముంబై ఆలౌటైంది.

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్‌(61), తిలక్‌ వర్మ(43) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో మొహిత్‌ శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. షమీ, రషీద్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించాడు. మే28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌లో సీఎస్‌కే, గుజరాత్‌ తాడోపేడో తెల్చుకోనున్నాయి.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సందడి చేసిన టీమిండియా యువ ఓపెనర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు