ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్‌ లక్ష్మణ్‌కు కీలక పదవి

27 Jul, 2022 07:38 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఎన్‌సీఏ హెడ్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ ఐసీసీలో కీలక పదవి చేపట్టాడు. మెన్స్‌ క్రికెట్‌ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు మంగళవారం ఐసీసీ పేర్కొంది. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డేనియల్‌ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేశామని బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు.

కాగా  ప్రస్తుతం ఎన్‌సీఏ అకాడమీ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్‌ ఐర్లాండ్‌ పర్యటనలో టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక మరో మాజీ క్రికెటర్‌ రోజర్‌ హార్పర్‌ను కూడా ప్రతినిధిగా అవకాశం ఇచ్చింది. అయితే రోజర్ హార్పర్‌ పాస్ట్‌ ప్లేయర్స్‌ రెండో ప్రతినిధిగా వ్యవహరించనున్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్‌ మహేళ జయవర్దనే ఇది వరకే ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌లో పాస్ట్‌ ప్లేయర్‌ ప్రతినిధిగా కొనసాగుతున్నాడు.

ఇక ఇదే సమావేశంలో 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.ముందుగా 2024లో బంగ్లాదేశ్‌ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్‌ మెగా ఈవెంట్‌ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్‌ ఇంగ్లండ్‌లో జరుగుతుంది.

చదవండి: భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌

మరిన్ని వార్తలు