గిల్‌ ఇలాగే ఆడావో.. రాహుల్‌, అగర్వాల్‌ వచ్చేస్తారు!

5 Mar, 2021 10:48 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ గురువారం నుంచి మొదలైన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ పర్యటనలో అర్థసెంచరీలతో అలరించిన గిల్‌ స్వదేశీ గడ్డపై మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. సిరీస్‌ మొత్తంలో మొదటి టెస్టులో హాఫ్‌ సెంచరీ సాధించిన గిల్‌.. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌(0, 14, 11,15*,0) ఆడలేదు. ఇందులో రెండు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. తాజాగా గిల్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్‌ లక్క్ష్మణ్‌ గిల్‌ ఆటతీరుపై స్పందించాడు.

''గిల్‌ ఆటతీరులో ఏదో టెక్నికల్‌ సమస్య ఉంది. ఆసీస్‌ పర్యటనలో అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న అతను స్వదేశంలో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై వేదికతో పోలిస్తే అహ్మదాబాద్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంది. కొద్దిసేపు ఓపికను ప్రదర్శిస్తే మంచి స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. గిల్‌ ఇన్నింగ్స్‌లను మంచి దృక్పథంతో ఆరంభిస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించకుంటే గిల్‌కు తర్వాతి మ్యాచ్‌ల్లో కష్టమవుతుంది. ఎందుకంటే గిల్‌ విఫలమైతే మాత్రం ​అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు జట్టులోకి వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.'' అంటూ తెలిపారు.

కాగా నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అక్షర్‌ పటేల్‌ 4 వికెట్లు, అశ్విన్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్‌ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.
చదవండి: 
పంత్‌ ట్రోలింగ్‌.. వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించింది

మరిన్ని వార్తలు