కింగ్స్‌ పంజాబ్‌పై వరుసగా 9వసారి..

8 Oct, 2020 20:58 IST|Sakshi

దుబాయ్‌:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. కింగ్స్‌ పంజాబ్‌పై మరోసారి సత్తాచాటాడు. తాజాగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించాడు. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్‌ సెంచరీ సాధించినట్లయ్యింది. ఐపీఎల్‌లో ఒక ప్రత్యర్థిపై ఇలా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు వరుసగా సాధించడం వార్నర్‌కు పంజాబ్‌పైనే అత్యధికం కావడం విశేషం. 2015 నుంచి 2020 మధ్య కాలంలో పంజాబ్‌పై ఆడిన ప్రతీసారి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఆర్సీబీపై వరుసగా 7హాఫ్‌ సెంచరీలను వార్నర్‌ సాధించగా, సీఎస్‌కేపై వరుసగా 5 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.

పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తొలుత బెయిర్‌ స్టో హాఫ్‌ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్‌ అర్థ శతకం సాధించాడు. వార్నర్‌ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌తో 52 పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరెంజ్‌ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.ఆపై వెంటనే బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటయ్యాడు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.దాంతో 160 పరుగుల వద్దే ఎస్‌ఆర్‌హెచ్‌ మరో వికెట్‌ను కోల్పోగా, మరో పరుగు వ్యవధిలో మనీష్‌ పాండే(1) వికెట్‌ను నష్టపోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పాండే నిష్క్రమించాడు. (చదవండి: ‘బీసీసీఐ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది’)

మరిన్ని వార్తలు