WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్‌ విజయం; ముంబైకి తొలి ఓటమి

18 Mar, 2023 19:06 IST|Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తొలిసారి హై ఓల్టెజ్‌ మ్యాచ్‌ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్‌ ఐదు వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్‌ సిక్సర్‌ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్‌ హారిస్‌ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో అమెలియా కెర్‌ రెండు వికెట్లు తీయగా.. నట్‌ సివర్‌, హేలీ మాథ్యూస్‌, ఇసీ వాంగ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్‌ అయింది. హేలీ మాథ్యూస్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. ఇసీ వాంగ్‌ 32, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్‌ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్‌ గైక్వాడ్‌, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. 

ఈ విజయంతో యూపీ వారియర్జ్‌ తన ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి. ఇక యూపీ వారియర్జ్‌ విజయంతో ఆర్‌సీబీ వుమెన్‌ ప్లేఆఫ్‌ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. వరుస ఓటములతో పూర్‌ రన్‌రేట్‌ కలిగి ఉండడమే దీనికి కారణం.

మరిన్ని వార్తలు