WC 2022 Final: ఫైనల్లో ఆ రెండు జట్లే తలపడాలి.. నా ఓటు కూడా వాళ్లకే: డివిలియర్స్‌

8 Nov, 2022 14:29 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - Final Prediction: భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన మేటి జట్లకు వరుణుడి అంతరాయం కారణంగా పరాభవం... సంచలనాలు సృష్టించిన చిన్న జట్లు.. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. కొంతమందికి ఖేదం.. మరికొంత మందికి మోదం.. ఇలా అనేకానేక భావోద్వేగాలకు కారణమైన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది.

విజేతగా నిలిచే క్రమంలో భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ సెమీ ఫైనల్స్‌కు సిద్దమయ్యాయి. గ్రూప్‌-1 నుంచి కివీస్, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-2 నుంచి టీమిండియా, పాక్‌ సెమీ పోరులో నిలిచాయి. ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఫైనల్‌పై తమ అంచనాలు తెలియజేస్తూ.. ట్రోఫీ కోసం దాయాదులు మరోసారి తలపడితే చూడాలని ఉందంటున్నారు.

నా ఓటు కూడా వాళ్లకే!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ కూడా ఇదే మాట అంటున్నాడు. ఈ మేరకు.. ‘‘ఫైనల్లో పాకిస్తాన్‌/ఇండియా?’’ అవునా? కాదా అంటూ ట్వీట్‌ చేయగా.. దాదాపుగా 77 శాతం మంది అవునని ఓటు వేశారు. ఇందుకు స్పందించిన డివిలియర్స్‌.. ‘‘70 శాతానికి పైగా అవునని ఓటు వేశారు. 

అయితే న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ కూడా తక్కువేమీ కాదు. ఇరు జట్లు మంచి లైనప్‌ కలిగి ఉన్నాయి. ఫామ్‌లో ఉన్నాయి కూడా! కాబట్టి ఈ సెమీ ఫైనల్స్‌ మరింత ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా నా ఓటు కూడా ఫైనల్లో ఇండియా/పాకిస్తాన్‌ మ్యాచ్‌కే! ఉత్కంఠ రేపే మ్యాచ్‌ కదా’’ అంటూ తాను సైతం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థుల పోరును చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

కాగా నవంబరు 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక టీ20 వరల్డ్‌కప్‌ తొలి ఎడిషన్‌ ఫైనల్లో టీమిండియా- పాక్‌ తలపడగా ధోని సేన విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిపీట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ అంచనాలు వేస్తూ మురిసిపోతున్నారు. అయితే, అంతకంటే ముందు ఇరు జట్లు సెమీస్‌లో గెలవాల్సి ఉంటుందని మర్చిపోవద్దు! 

చదవండి: IND VS ENG: వర్షం కారణంగా సెమీస్‌ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా
Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్‌.. ముక్కలైన హృదయం అంటూ..

Poll
Loading...
మరిన్ని వార్తలు