T20 WC 2022: ఫైనల్లో భారత్‌- పాక్‌? మేము ఆ అవకాశం ఇవ్వము!

9 Nov, 2022 13:58 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 : పదిహేనేళ్ల క్రితం.. టీ20 ప్రపంచకప్‌ తొలి ఎడిషన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను క్రికెట్‌ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఆఖరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగలతో విజయం సాధించింది. తొలి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

సుదీర్ఘ కాలం తర్వాత ఈ మెగా ఐసీసీ టోర్నీలో మరోసారి దాయాదులు ఫైనల్‌ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌-2022 తొలి సెమీ ఫైనల్‌లో బుధవారం (నవంబరు 9)పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు.. గురువారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి తుది మెట్టుపై అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

అన్నీ కుదిరి రెండు జట్లు ఫైనల్‌ చేరితే తమకు పండుగే అంటున్నారు ఫ్యాన్స్‌. అయితే, తామేమీ అంత సులువుగా తలవంచమని, ఫైనల్లో దాయాదులు పోటీ పడే అవకాశం ఇవ్వమంటున్నాడు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌. అడిలైడ్‌ వేదికగా నవంబరు 10న టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీ ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బట్లర్‌.. ‘‘ఫైనల్లో ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ ఉండాలని మేము అస్సలు కోరుకోవడం లేదు. కచ్చితంగా టీమిండియా అవకాశాలు దెబ్బతీస్తాము. నిజానికి వాళ్లది పటిష్టమైన జట్టు. 

సెమీ ఫైనల్‌ ఆడేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నాం. ముఖ్యంగా మేటి జట్టు అయిన భారత్‌తో పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. టీమిండియాను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పుకొచ్చాడు. 
చదవండి: సూర్యకుమార్‌ నన్ను చంపేశాడంటే నమ్మండి.. మొయిన్‌ అలీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు