Rohit Sharma: తొమ్మిదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.. అయితే ఈసారి మాత్రం..

22 Oct, 2022 11:49 IST|Sakshi
గతేడాది ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించిన కోహ్లి సేన

T20 World Cup 2022- Rohit Sharma- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్‌-2022 ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గత తొమ్మిదేళ్లుగా భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవకపోవడం నిరాశకు గురిచేసిందని.. ఈసారి ఆ లోటు తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపాడు. పొట్టి క్రికెట్‌ సమరం మొదటి ఎడిషన్‌ నుంచి రోహిత్‌ శర్మ జట్టులో ఉన్న విషయం తెలిసిందే.

అయితే, ఈసారి అతడు కెప్టెన్‌ హోదాలో వరల్డ్‌కప్‌ ఆడనున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం (అక్టోబరు 23) నాటి మ్యాచ్‌తో టీమిండియా సారథిగా మొదటిసారిగా ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు ముందుకు రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు.

నిరాశకు గురయ్యాం.. అయితే ఈసారి
ఈ సందర్భంగా గత ప్రపంచకప్‌లో పరాభవం, తదనంతరం టీ20 ఫార్మాట్‌లో ఎదురులేని జట్టుగా నిలిచినప్పటికీ ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో వైఫల్యం తదితర అంశాల గురించి హిట్‌మ్యాన్‌ స్పందించాడు. ఈ మేరకు.. ‘‘గత తొమ్మిదేళ్లుగా మేము ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.

నిరాశకు గురైన విషయం వాస్తవమే. అయితే, జట్టు రాతను మార్చే అవకాశం ఇప్పుడు మా చేతుల్లో ఉంది. అయితే, ఈ అంశాలు మాపై ఒత్తిడిని పెంచలేవు. మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా కష్టపడతాం. 

మాకు ఆ సత్తా ఉంది
నిజానికి మేము గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా ఆడుతున్నాం. కానీ కొన్ని పొరపాట్ల వల్ల కీలక సమయాల్లో ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది. తప్పులు సరిదిద్దుకుంటాం. చెప్పాలంటే మా జట్టు పటిష్టంగానే ఉంది. ఐసీసీ ఈవెంట్‌లో అగ్రస్థాయికి చేరుకునే సత్తా కలిగి ఉంది’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా మెల్‌బోర్న్‌ వేదికగా జరుగనున్న ఆరంభ మ్యాచ్‌కు టీమిండియా ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది.

అదే ఆఖరు
ఇక 2007లో టీ20 ప్రపంచకప్‌, వన్డే వరల్డ్‌కప్‌-2011 తర్వాత టీమిండియా చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలవలేదు. ధోని తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టి.. విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లి ఐసీసీ టైటిల్‌ గెలవకుండానే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు.

చదవండి: Cricket West Indies Board: విండీస్‌ జట్టుకు పోస్టుమార్టం​ జరగాల్సిందే..!
IND Vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. వీళ్లు ఎదురుపడితే మజానే వేరు
T20 WC 2022: వీరిపైనే భారీ అంచనాలు.. ఈ టీమిండియా ‘స్టార్లు’ రాణిస్తేనే!

Poll
Loading...
మరిన్ని వార్తలు