'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు'

12 May, 2021 14:09 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ జట్టు ఈ ఏడాది మంచి ఫామ్‌  కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బాబర్‌ అజమ్‌ సారధ్యంలోని పాక్‌ జట్టు వరుసగా నాలుగు సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. మొదట దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌తో పాటు.. జింబాబ్వేతో జరిగిన టెస్టు , టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే పాక్‌ జట్టు దక్షిణాఫ్రికాపై సిరీస్‌ గెలవడానికి ప్రొటీస్‌ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు లేకపోవడయే కారణమని కొందరు విమర్శించారు. ఐపీఎల్‌ సీజన్‌లో పాల్గొనడానికి పలువరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రావడంతో పాక్‌ జట్టు బలంగా లేని జట్టుపై సిరీస్‌ గెలవడం పెద్ద గొప్ప విషయం కాదన్నారు. అంతేగాక జింబాబ్వే జట్టులో పలువురు సీనియర్‌ ఆటగాళ్లు గాయాల కారణంతో ఆడకపోవడంతో అత్యంత బలహీనంగా ఉన్న జట్టుపై సిరీస్‌ను గెలవడం పెద్ద గొప్ప కాదంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై పాకిస్తాన్‌ ప్రధాన కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ స్పందించాడు.

''దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేరన్న మాట నిజమే.. కానీ వారు ఆడింది హోం గ్రౌండ్‌లో అన్న విషయం మరిచిపోయారు. బలహీనంగా కనిపించే ఏ జట్టైనా  స్వదేశంలో ఆడుతున్నారంటే కాస్త బలంగానే కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ ప్రొటీస్‌ జ​ట్టు మంచి ప్రదర్శన చేయలేకపోయింది. మేం వారి నుంచి సరైన పోటీ అందుకోలేకపోయామంటే దానికి కారణం వారి జట్టు బలంగా లేదని అర్థం. ముందు దక్షిణాఫ్రికా జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడి అప్పుడు ఈ విమర్శలు చేయండి. మేం సిరీస్‌ గెలిచామంటే ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉందనే కదా అర్థం.

జింబాబ్వే సిరీస్‌తోనూ ఇదే వర్తిస్తుంది. వారికి అది హోం గ్రౌండే.. కానీ ఉపయోగించుకోలేకపోయారు. అది వదిలేసి ఇలా దెప్పి పొడుస్తూ మాట్లాడడం సరికాదు. అయినా మేం విమర్శలు పట్టించుకోం.. మేం కష్టపడ్డాం.. ఫలితం సాధించాం. మా పనేంటో మాకు తెలుసు.. మీరు చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక మా బ్యాటింగ్‌లో పవాద్‌ అలమ్‌, బాబర్‌ అజమ్‌ అజర్‌ అలీ వెన్నుముకలా నిలిచారు. బౌలింగ్‌లో హసన్ అలీ కీలకపాత్ర పోషించాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్‌ తన తర్వాతి సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడనుంది.
చదవండి: కోహ్లి అండతోనే నేనిలా...

ZIM Vs PAK: పాకిస్తాన్‌దే టెస్టు సిరీస్‌ 

మరిన్ని వార్తలు