భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 Oct, 2022 17:27 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజీ సమరంపై ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ ప్రేమికులకు వరల్డ్‌కప్‌ మొత్తం మ్యాచ్‌లు చూసిన తర్వాత వచ్చే మజా ఒక్క మ్యాచ్‌తోనే (ఇండియా-పాక్‌) వచ్చింది కాబట్టి, ఈ మెగా టోర్నీని ఇంతటితో ఆపేయడం బెటర్‌ అని వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎన్నో మలుపులు, హై డ్రామా, సస్పెన్స్‌, థ్రిల్‌, ఉద్విగ్వ సన్నివేశాలు.. ఇలా సగటు క్రికెట్‌ అభిమానికి కావాల్సిన ప్రతీది ఈ మ్యాచ్‌లో దొరికిందని పేర్కొన్నాడు. 

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇంతకు మించిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ను చూడలేమని చెప్పుకొచ్చాడు. భారత్-పాక్‌ మ్యాచ్ ఎప్పుడూ ఓ అద్భుతమేనని, దాయాదుల సమరం కోట్లాది మంది ప్రజల భావోద్వేగమని, సగటు ప్రేక్షకుడిలా మైదానంలో మ్యాచ్‌ను వీక్షిస్తే ఎలా ఉంటుందో ఊహించలేనని తెలిపాడు. ఈ సందర్భంగా మార్ష్‌.. విరాట్‌ విశ్వరూపాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. విరాట్‌కు మించిన ఆటగాడు మరొకరు లేరని, అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని, ప్రపంచకప్‌లో విరాట్‌ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ మరిన్ని ఆశిస్తున్నానని కంక్లూడ్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చావుదెబ్బ తిన్న ఆస్ట్రేలియా ఇవాళ (అక్టోబర్‌ 25) శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ జట్టులో స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు కరోనా నిర్ధారణ కావడంతో అతని స్థానంలో ఆస్టన్‌ అగర్‌ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక మాత్రం ఐర్లాండ్‌పై గెలిచిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. 
చదవండి: లంకతో పోరుకు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌.. కీలక బౌలర్‌కు అనారోగ్యం

>
Poll
Loading...
మరిన్ని వార్తలు