న్యూజిలాండ్‌తో రెండో టీ20.. మళ్లీ అదే బ్యాడ్‌ న్యూస్‌..!

19 Nov, 2022 15:26 IST|Sakshi

IND VS NZ 2nd T20: 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే నవంబర్‌ 18న వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రేపు (నవంబర్‌ 20) మౌంట్‌ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరగాల్సిన రెండో మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ కూడా సాధ్యపడే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్‌ సమయానికి (భారతకాలమానం ప్రకారం​మధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యి ఉంటుందని, 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. అయితే వాతావరణం‍లో అనూహ్య మార్పులు జరిగితే మాత్రం కొద్ది ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశాలు కూడా లేకపోలేదని తెలిపింది. 

కాగా, టీ20 వరల్డ్‌కప్‌-2022 అనంతరం సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ రెస్ట్‌ తీసుకోవడంతో టీమిండియా యువ జట్లతో (టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు) న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్‌ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధవన్‌ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నారు. 

వరుణుడు కరుణించి ఆట సాధ్యపడితే భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందంటే.. యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్లు రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ ముగ్గురికి తుది జట్టులో ఛాన్స్‌ దొరికే అవకాశం ఉంది.  

వరల్డ్‌కప్‌లో అవకాశాలు దక్కని దీపక్‌ హుడా, హర్షల్‌ పటేల్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుం‍దర్‌ ఛాన్స్‌ కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. పేసర్ల కోటాలో స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ స్థానాలు పక్కా కాగా.. ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్‌ సిరాజ్‌ల మధ్య పోటీ ఉండే ఛాన్స్‌ ఉంది.   

తుది జట్టు (అంచనా)..
శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాం‍సన్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌/చహల్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/మహ్మద్‌ సిరాజ్‌. 

టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.
చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్‌ కన్ఫర్మ్‌, వన్డే, టెస్ట్‌లకు..?

 

మరిన్ని వార్తలు