రెండో టెస్టులో 17 పరుగులతో నెగ్గిన కరీబియన్ జట్టు
సిరీస్ 2–0తో క్లీన్స్వీప్
ఢాకా: ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన వెస్టిండీస్ మైదానంలో మాత్రం టాప్ క్లాస్ ఆటను ప్రదర్శించింది. బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో కరీబియన్ జట్టు 17 పరుగుల ఆధిక్యంతో అద్భుత విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. నాలుగో రోజే ముగిసిన ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో విండీస్ స్పిన్నర్లు రకీమ్ కార్న్వాల్ (4/105), జోమెల్ వారికన్ (3/47), క్రెయిగ్ బ్రాత్వైట్ (3/25) సత్తా చాటారు.
తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన కార్న్వాల్ రెండో ఇన్నింగ్స్లోనూ కీలక ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 41/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్... బంగ్లా స్పిన్నర్లు తైజుల్ ఇస్లామ్ (4/36), నయీమ్ హసన్ (3/34) కట్టడి చేయడంతో 117 పరుగులకే ఆలౌటైంది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను విండీస్ స్పిన్నర్లు కార్న్వాల్, వారికన్, బ్రాత్వైట్ తిప్పేశారు. దాంతో బంగ్లాదేశ్ 213 పరుగులకు ఆలౌటై విజయం ముంగిట బోల్తా పడింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... చివర్లో మిరాజ్ (31; 3 ఫోర్లు, 2 సిక్స్) జట్టును గెలిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.