‘మీ పతకాలు వెనక్కి ఇచ్చేయండి’

12 Sep, 2020 08:20 IST|Sakshi

రెజ్లర్లకు డబ్ల్యూఎఫ్‌ఐ ఆదేశం

న్యూఢిల్లీ: డోపింగ్‌లో విఫలమైన రెజ్లర్లు ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ధ్రువపత్రాలను వెనక్కి ఇచ్చేయాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఈ విధంగా చేస్తున్నట్లు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్‌ తోమర్‌ తెలిపారు. గత నాలుగు సీజన్ల ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌తో పాటు స్కూల్‌ యూత్, యూనివర్సిటీ క్రీడల్లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్‌లో విఫలమయ్యారు. ఇందులో ఆరుగురు ఫ్రీస్టయిల్‌ రెజ్లర్లు కాగా, మరో ఆరుగురు గ్రోకో రోమన్‌ విభాగానికి చెందినవారు.

వీరి నుంచి పతకాలను వెనక్కి తీసుకోవడంలో అనుబంధ రాష్ట్ర సంఘాలు సహాయం చేయాలని డబ్ల్యూఎఫ్‌ఐ కోరింది. డోపింగ్‌ పరీక్షలో విఫలమైన రెజ్లర్లలో రోహిత్‌ దహియా (54 కేజీలు), అభిమన్యు (58 కేజీలు), వికాస్‌ కుమార్‌ (65 కేజీలు), విశాల్‌ (97 కేజీలు), వివేక్‌ భరత్‌ (86 కేజీలు), జస్‌దీప్‌ సింగ్‌ (25 కేజీలు), మనోజ్‌ (55 కేజీలు), కపిల్‌ పల్‌స్వల్‌ (92 కేజీలు), జగదీశ్‌ రోకడే (42 కేజీలు), రోహిత్‌ అహిరే (72 కేజీలు), విరాజ్‌ రన్వాడే (77 కేజీలు), రాహుల్‌ కుమార్‌ (63 కేజీలు) ఉన్నారు.

మరిన్ని వార్తలు